ఐపీఎల్లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అభిమానులకు ఉత్సాహం పంపింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు యువ ప్లేయర్ ప్రభ్సిమ్రన్ (60), శిఖర్ ధవన్ (86 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచి పంజాబ్ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ఈజీగా 200 పరుగుల మార్కు దాటేస్తుందని అనిపించింది.
కానీ రాజస్థాన్ బౌలర్లు చక్కగా పుంజుకొని పంజాబ్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో రాజస్థాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటర్లు.. ఆ జట్టుకు అదిరిపోయే స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. ఎవరూ ఊహించని విధంగా రవిచంద్రన్ అశ్విన్ను రాజస్థాన్ ఓపెనర్గా పంపింది. కానీ ఈ వ్యూహం ఆ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. అతను పెద్దగా ఏం చేయకుండానే పెవిలియన్ చేరాడు.

అతని కన్నా ముందుగానే భారీ షాట్లు ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ కూడా మైదానం వీడాడు. ఇలాంటి సమయంలో జట్టును విజయం దిశగా తీసుకెళ్లే బాధ్యతను జోస్ బట్లర్ (19), సంజూ శాంసన్ (42) ప్రయత్నించారు. చివర్లో హెట్మెయర్ (36), ధ్రువ్ జూరెల్ (32 నాటౌట్) కూడా పోరాడినా.. శామ్ కర్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను విజయతీరాలకు చేరనివ్వలేదు. దీంతో రాజస్థాన్ జట్టు చివరకు ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో కొన్ని షాకింగ్ ఘటనలు కూడా జరిగాయి. శిఖర్ ధవన్ను అశ్విన్ మన్కడింగ్ చేయబోయాడు కూడా. ఇలాంటి ఉర్రూతలూగించే సీన్స్ అన్నీ చూసిన అభిమానులు.. ఐపీఎల్లో రాజస్థాన్, పంజాబ్ మధ్య సూపర్ రైవలరీ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది క్లాసిక్ ఐపీఎల్ వైరం అని మెచ్చుకుంటున్నారు. కొందరైతే 'రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అది కచ్చితంగా బ్లాక్ బస్టరే' అని తమ ఉత్సాహం పంచుకుంటున్నారు.