ఐపీఎల్లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అభిమానులకు ఉత్సాహం పంపింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు యువ ప్లేయర్ ప్రభ్సిమ్రన్ (60), శిఖర్ ధవన్ (86 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచి పంజాబ్ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ఈజీగా 200 పరుగుల మార్కు దాటేస్తుందని అనిపించింది.
కానీ రాజస్థాన్ బౌలర్లు చక్కగా పుంజుకొని పంజాబ్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో రాజస్థాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటర్లు.. ఆ జట్టుకు అదిరిపోయే స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. ఎవరూ ఊహించని విధంగా రవిచంద్రన్ అశ్విన్ను రాజస్థాన్ ఓపెనర్గా పంపింది. కానీ ఈ వ్యూహం ఆ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. అతను పెద్దగా ఏం చేయకుండానే పెవిలియన్ చేరాడు.

అతని కన్నా ముందుగానే భారీ షాట్లు ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ కూడా మైదానం వీడాడు. ఇలాంటి సమయంలో జట్టును విజయం దిశగా తీసుకెళ్లే బాధ్యతను జోస్ బట్లర్ (19), సంజూ శాంసన్ (42) ప్రయత్నించారు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (29 బంతుల్ల 26) పరమ జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో చివర్లో వచ్చిన హెట్మెయర్ (36), ధ్రువ్ జూరెల్ (32 నాటౌట్)పై బాగా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెట్మెయర్ మైదానం వీడాడు.
ఇక చివరి ఓవర్లో శామ్ కర్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను విజయతీరాలకు చేరనివ్వలేదు. దీంతో రాజస్థాన్ జట్టు చివరకు ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ చూసిన రాజస్థాన్ ఫ్యాన్స్ అంతా కూడా దేవదత్ పడిక్కల్ను ఒక ఆటాడుకుంటున్నారు. ఆర్సీబీ అతన్ని వదిలేసి చాలా మంచి పని చేసిందని మెచ్చుకుంటున్నారు. అతని జిడ్డు బ్యాటింగ్ వల్లనే రాజస్థాన్ రిస్కులో పడిందని కూడా తిట్టిపోస్తున్నారు. మరి తర్వాతి మ్యాచులో అయినా పడిక్కల్ రాణిస్తాడేమో చూడాలి.