
ప్రారంభంలోనే భారీ షాక్:
భారీ లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్కు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ హిట్టర్ జొస్ బట్లర్ 4 పరుగులకే వెనుతిరగడంతో జట్టు ఒత్తిడికి గురైంది. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజు శాంసన్ జట్టును ఆదుకున్నారు. రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా.. వికెట్ కాపాడుకుంటూ అద్భుతంగా ఆడారు. స్మిత్ బౌండరీలతో పరుగులు రాబట్టగా.. శాంసన్ సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో స్మిత్, శాంసన్ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

ఒత్తిడిలో శాంసన్ ఔట్:
9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. అయితే ఇక్కడే రాయల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ చేసిన స్మిత్ పెవిలియన్ చేరాడు. స్మిత్ పెవిలియన్ చేరినా శాంసన్ పోరాటం కొనసాగించాడు. కానీ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఆ ఒత్తిడిలోనే శాంసన్ 85 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో రాజస్థాన్ ఓటమి ఖాయంగా కనపడింది. ఇక రాహుల్ తెవాటియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. దీంతో రాజస్థాన్ పనయిపోయిందనుకున్నారు.

ఒకే ఓవర్లో ఐదు సిక్సులు:
రాహుల్ తెవాటియా తొలుత పరుగులు తీసేందుకు ఇబ్బంది పడినా.. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా ఐదు సిక్సులు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ తరువాత షమీ ఓవర్లో రాబిన్ ఊతప్ప ఔట్ కాగా.. క్రీజ్లోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్ మళ్లీ బ్యాట్ ఝుళిపించాడు. రావడంతోనే రెండు సిక్సులు బాదేశాడు. తెవాటియా కూడా ఓ సిక్స్ కొట్టడంతో టార్కెట్ 6 బంతులకు 2 పరుగులకు చేరింది. చివరి ఓవర్లో ఎం అశ్విన్ ఓ వికెట్ తీసినా.. టామ్ కరన్ తొలి బంతినే బౌండరీగా మలచి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 19.3 ఓవర్లలోనే రాజస్థాన్ టార్గెట్ను ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా.. కాట్రెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

మయాంక్ సెంచరీ:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది . ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (106; 50 బంతుల్లో 10x4, 7x6), కెప్టెన్ కేఎల్ రాహుల్ (69; 54 బంతుల్లో 7x4, 1x6) ఇన్నింగ్స్ మెదటి నుంచీ బౌండరీలతో అలరించారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్కు పంజాబ్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా 183 పరుగులు జోడించారు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్.. మరో 19 బంతుల్లో దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు.

మాక్స్వెల్ జోరు:
సెంచరీ బాది జోరు మీదున్న మయాంక్ 16.3 ఓవర్లో టామ్ కరన్ బౌలింగ్లో షాట్ ఆడబోయి కీపర్ సంజూ శాంసన్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి రాహుల్.. అంకిత్ రాజ్పుత్ బౌలింగ్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద శ్రేయస్ గోపాల్ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్ 194 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. చివర్లో గ్లెన్ మాక్స్వెల్ (13; 9 బంతుల్లో 2x4), నికోలస్ పూరన్ (25; 8 బంతుల్లో 1x4, 3x6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజాబ్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












