కేకేఆర్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 149 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు.
తొలి ఓవర్ నుంచే జైస్వాల్ ఊచకోత మొదలైంది. అయితే జైస్వాల్తో కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జోస్ బట్లర్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్గా పెవిలియన్ చేరాడు. బట్లర్ అవుటైన బాధ్యత కూడా తనే తీసుకున్న జైస్వాల్.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఆ తర్వాత కూడా జైస్వాల్ తన జోరు తగ్గించలేదు. అయితే పవర్ప్లే ముగియడంతో అతను కూడా జాగ్రత్తగా ఆడాడు. అయినా సరే అవకాశం దొరికినప్పుడల్లా బంతని బౌండరీ దాటిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలో అతనికి జతకలిసిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు.
వీళ్లిద్దరూ భారీ షాట్లతో చెలరేగడంతో కేకేఆర్ స్పిన్నర్లు ఏం చెయ్యలేకపోయారు. వాళ్లు ఎంత కష్టపడినా వికెట్లు మాత్రం పడడలేదు. ఇదంతా చూసిన అభిమానులు కూడా జైస్వాల్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో యువరాజ్ను చూసినట్లుంది అంటున్నారు. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడేలేదే? అని ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అయితే ఈ రికార్డు యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేసి ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్ (98 నాటౌట్), సంజూ శాంసన్ (48 నాటౌట్) ఇద్దరూ అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఒక్క బౌలర్ కూడా వికెట్ తీసుకోలేకపోయారు.