కేకేఆర్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (98 నాటౌట్) చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 149 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు.
తొలి ఓవర్ నుంచే జైస్వాల్ ఊచకోత మొదలైంది. అయితే జైస్వాల్తో కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జోస్ బట్లర్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్గా పెవిలియన్ చేరాడు. బట్లర్ అవుటైన బాధ్యత కూడా తనే తీసుకున్న జైస్వాల్.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకొని అభిమానుల్లో జోరు పెంచాడు.

ఆ తర్వాత అతనికి జతకలిసిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లతో చెలరేగడంతో కేకేఆర్ స్పిన్నర్లు ఏం చెయ్యలేకపోయారు. వాళ్లు ఎంత కష్టపడినా వికెట్లు మాత్రం పడడలేదు. వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఒక్క బౌలర్ కూడా వికెట్ తీసుకోలేకపోయారు.
ఈ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా స్పందించాడు. 'జైస్వాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒక్కోరోజు మనం అనుకున్న ఏదీ అలా జరగదు. ఈ రోజు నాకు అలాంటిదే. ఈ పిచ్పై కనీసం 180 పరుగులైనా చేసి ఉండాల్సింది అనుకున్నా. కానీ అది జరగలేదు. బ్యాటింగ్లో మేం చాలా తప్పులు చేశాం' అని చెప్పాడు.
'బ్యాటింగ్లో పొరపాట్ల వల్లే మేం ఈ మ్యాచ్ ఓడిపోయి, రెండు పాయింట్లు కోల్పోయాం. ఇక బౌలింగ్లో కూడా ఏం చెయ్యలేకపోయాం. నేను పార్ట్ టైమ్ బౌలర్ను మాత్రమే. నేను బరిలో దిగి జైస్వాల్ను అవుట్ చేయొచ్చని అనుకున్నా. అది ఒక పెద్ద గ్యాంబిల్. ఆ ప్లాన్ కూడా ఫలించలేదు. కానీ ఇది అతని రోజు. మేం ఏం చెయ్యలేకపోయాం' అని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో నితీష్ రాణా ఒకే ఓవర్ వేసి 26 పరుగులు ఇచ్చాడు.