ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ విజయ పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో రాజస్థాన్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఆర్సీబీ బౌలింగ్ను ముక్కలు చేశాడు. 300 స్ట్రైక్ రేట్తో ఆడిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపానే మార్చేసింది. మధ్యలో కొన్ని వికెట్లు పడినా ధ్రువ్ జురేల్(81 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

బౌలింగ్ ప్రదర్శన పట్ల కెప్టెన్ అసంతృప్తి
మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. జట్టు విజయం సాధించినప్పటికీ బౌలింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. "గత కొన్నేళ్లుగా ఈ వేదికపై మా రికార్డు అంత ఆశాజనకంగా లేదు, కానీ ఈరోజు ఆట తీరు బాగుంది. అయితే బౌలర్లు ఇంకాస్త క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేసేలా కనిపించినా.. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి వారిని కట్టడి చేశాం. కానీ నిజానికి వారిని 170 పరుగుల లోపే నియంత్రించి ఉండాల్సింది. కెప్టెన్గా నేను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను" అని పరాగ్ నిజాయితీగా అంగీకరించాడు.
పిచ్ స్వభావం, వ్యూహాలు
మైదానంలోని పిచ్ పరిస్థితులపై స్పందిస్తూ.. స్పిన్నర్లకు వ్యతిరేకంగా డౌన్ ది గ్రౌండ్ సిక్సర్లు కొట్టడం ఈ వికెట్పై అంత సులభం కాదని పరాగ్ విశ్లేషించాడు. "మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో బ్యాటర్లకు అనవసరంగా రూమ్ ఇచ్చారు, అది వారికి అనుకూలంగా మారింది. గౌహతి, జైపూర్లలో మేము చేసిన ముందస్తు సన్నద్ధత ఇక్కడ పనిచేసింది. ఇక్కడి నల్ల రేగడి మట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు ముందే తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఒక జట్టుగా మా లక్ష్యం. ఇప్పటివరకు మేము స్టిక్కీ పిచ్లపై ఆడాము, బ్యాటింగ్కు అనుకూలమైన 'బెల్టర్' పిచ్ లభిస్తే మా ఆట ఇంకా అద్భుతంగా ఉంటుంది" అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఒక చిచ్చర పిడుగు
ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి, 300 స్ట్రైక్ రేట్తో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. వైభవ్ సూర్యవంశీ గురించి రియాన్ పరాగ్ ముచ్చటిస్తూ.. "వైభవ్ జట్టులో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను ఇంకా చిన్న పిల్లాడు, అతనికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. మేము అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి ప్రేమ" అని సరదాగా వ్యాఖ్యానించాడు.
విజయతీరాలకు చేర్చిన ధ్రువ్ జురెల్
సూర్యవంశీ విధ్వంసం సృష్టించినా, మధ్యలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆ సమయంలో ధ్రువ్ జురేల్ తన అనుభవాన్నంతా ఉపయోగించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ఐదోసారి (2015లో 5 విజయాలు, 2024లో 4 విజయాలు) సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే ఈసారి కప్పు గెలవడం రాయల్స్కు కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.