సొంతగడ్డపై రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6x4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. స్లో పిచ్పై పంజాబ్ బౌలర్లు సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో చెలరేగారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ జైస్వాల్ (4; 4 బంతుల్లో, 1x4) తొలి ఓవర్లోనే సామ్ కరన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పవర్ప్లే వరకు మరో వికెట్ కోల్పోకపోయినప్పటికీ రాజస్థాన్ బౌండరీల మోత మోగించలేకపోయింది. 6 ఓవర్లకు 38/1 స్కోరుతో నిలిచింది. బట్లర్ స్థానంలో వచ్చిన టామ్ కోహ్లెర్ (18; 23 బంతుల్లో, 2x4, 1x6) నిదానంగా ఆడటం రాజస్థాన్ పవర్ప్లే స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించింది.

అయితే పవర్ల్ ప్లే ముగిసిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ (18; 15 బంతుల్లో, 3x4)ను నాథన్ ఎలిస్, టామ్ను రాహుల్ చాహర్ వరుస ఓవర్లలో పెవిలియన్కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 4x3, 1x6)తో కలిసి రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రియాన్ నిలకడగా ఆడగా, అశ్విన్ అదిరే షాట్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో యాష్ వరుసగా ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు.
కానీ , ఆ తర్వాతి ఓవర్లోనే అశ్విన్ భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. అనంతరం ధ్రువ్ జురెల్ (గోల్డెన్ డకౌట్), పావెల్ (4; 5 బంతుల్లో, 1x4) విఫలమవ్వడంతో 102 పరుగులకే రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్లో రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఓవర్కో బౌండరీ చొప్పున బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే ఆఖరి ఓవర్ రెండో బంతికి పరాగ్ను హర్షల్ బోల్తాకొట్టించాడు.