RR vs PBKS: బ్యాటర్లు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లు అద్బుతమైన బ్యాటింగ్, బలమైన బౌలింగ్ సాయంతో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టును 10 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2025లో 59వ మ్యాచ్లో విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ స్థానాన్ని బలోపేతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్ల్లో ఇది 8వ విజయం కాగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ రేసులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2014 తర్వాత పంజాబ్ తొలిసారి ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు రాజస్థాన్ తరపున అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మంచి ఆరంభం లభించినప్పటికీ ఆ జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ అర్థ సెంచరీలు సాధించినా పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో ఓటమి పాలైంది.

ఫలించని యశస్వి, ధ్రువ్ జురేల్ ప్రయత్నాలు
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్పోవడానికి ఏమీ లేదు. అయినప్పటికీ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ తమ జట్టును విజయపథంలో నడిపించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. యశస్వి జైస్వాల్ జట్టు తరఫున 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ సమయంలో జైస్వాల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో 22 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్లో యశస్వి 9 ఫోర్లు, 1 సిక్స్ కూడా కొట్టాడు. ఈ సమయంలో యశస్వికి ఇన్నింగ్స్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ నుండి కూడా మద్దతు లభించింది. వైభవ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు.
తర్వాత ధ్రువ్ జురేల్ చివరి ఓవర్ వరకు రాజస్థాన్ జట్టు ఆశలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నించాడు కానీ 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తర్వాత అతను ఔట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురేల్ కాకుండా సంజూ శాంసన్ 20 పరుగులు , షిమ్రాన్ హెట్మెయర్ 11 పరుగులు అందించారు. బౌలింగ్ విషయానికొస్తే, పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, మార్కో యన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఇలా..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లు అర్థ శతకాలతో అద్భుతంగా రాణించారు. నేహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేశాడు. చివరలో అజ్మతుల్లో ఒమర్జాయ్ 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 21 పరుగులతో పరవాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(9), మిచెల్ ఓవెన్(0) విఫలం అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టగా.. క్వెనా మఫాక్, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వల్ తలో వికెట్ తీసుకున్నారు.