
షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగారు. నాథన్ కౌల్టర్ నైల్, జిమ్మీ నీషమ్, జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో రాజస్థాన్ 100 పరుగులు కూడా చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. స్టార్ ప్లేయర్స్ యశస్వీ జైస్వాల్, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్ నిరాశపరిచారు. పటిష్ట బ్యాటింగ్ లనప్ ఉన్న ముంబైకి 91 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ముంబై బౌలర్లలో కౌల్టర్ నైల్ నాలుగు, నీషమ్ మూడు, బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచులో ఓడిన జట్టు ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించనుంది.
పిచ్ బౌలింగ్కు అనుకూలించడంతో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్ జరిగిన తీరు చూస్తే రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించకమానదు. ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటర్లు విలవిలలాడారు. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం పరిపాటుగా మారిపోయింది. రాయల్స్ ఓపెనర్స్ లూయిస్ (24), జైస్వాల్ (12) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్లో జైస్వాల్ వెనుతిరగడంతో రాజస్థాన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ వెంటనే లూయిస్ అవుట్ అయ్యాడు. ఇలా వరుస వికెట్లు కోల్పోయి రాజస్థాన్ తీవ్ర కష్టాల్లోకి కూరుకుపోయింది.
కెప్టెన్ సంజూ శాంసన్ (3), శివమ్ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్ (4) విఫలమయ్యారు. ఒకానొక సమయంలో రాజస్థాన్ 50 పరుగులకు 5 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత కాస్త మ్యాచ్ గాడిన పడుతుందనుకునే సమయంలో ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటర్లు ఎవరూ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. డేవిడ్ మిల్లర్ (15), రాహుల్ తెవాటియా (12) జోడి నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో జిమ్మీ నీషమ్ ఈ జోడిని విడగొట్టాడు. 15వ ఓవర్ చివరి బంతికి రాహుల్ తెవాటియా కీపర్కి చిక్కాడు. కొద్దిసేపటికే మిల్లర్ కూడా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చిన శ్రేయస్ గోపాల్ (0), చేతన్ సకారియా (6) రాణించలేకపోయారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ (8) నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో రాజస్థాన్కు ఇదే అత్యల్ప స్కోర్. ముంబై బౌలర్లలో కౌల్టర్ నైల్ 4, నీషమ్ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.