
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ:
మొదటగా నాథన్ కౌల్టర్నైల్ (4/14), జేమ్స్ నీషమ్ (3/12), జస్ప్రీత్ బుమ్రా (2/12)లు సూపర్ బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్లకు 90 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో) చెలరేగి ఆడటంతో.. ముంబై మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో నెట్ రన్ రేట్ కూడా పెంచుకుంది. ఇక ప్లే ఆఫ్స్కి చేరాలంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు కోల్కతా నైట్రైడర్స్ని రాజస్థాన్ రాయల్స్ ఓడించాలి. ఈ రెండు జరిగితేగాని రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరదు.

ఓపెనింగ్ చేయడం బాగుంది:
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ తన ఆటపై ఆనందం వ్యక్తం చేశాడు. 'ముంబై ఇండియన్స్ జట్టుకు తిరిగి ఓపెనింగ్ చేయడం బాగుంది. జట్టు కోసం పరుగులు చేయడం, భారీ తేడాతో విజయం సాధించడానికి సహాయపడటం చాలా ఆనందంగా ఉంది. మంచి ఇన్నింగ్స్ ఆడాననే అనుకుంటున్నా. నిజంగా ఇది మంచి అనుభూతి. రోహిత్ భాయ్ మంచి ఆరంభం ఇచ్చాడు. భాయ్ ధాటిగా ఆడడంతో నాపై ఒత్తిడి తగ్గింది. మా జట్టు పుంజుకోవడానికి ఈ విజయం అవసరం' అని ఇషాన్ కిషన్ అన్నాడు. ఐపీఎల్ 2021లో ఇషాన్ కిషన్ తడబడ్డాడు. వరుసగా విఫలమవ్వడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. అయితే అతడిపై నమ్మకంతో రాజస్థాన్ మ్యాచులో అవకాశం ఇవ్వగా.. రెచ్చిపోయి ఆడాడు.

వీడియోలను చూడమని చెప్పాడు:
'ఒడిదొడుకులు అనేవి ఏ క్రీడాకారుని జీవితంలోనైనా ఓ భాగం అని నేను భావిస్తా. ప్రస్తుతం నేను కూడా గొప్ప స్థితిలో లేను. గత సీజన్లలో మాదిరిగా.. చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అయితే పుంజుకోవడం చాలా ముఖ్యం. మాకు మంచి సహాయక సిబ్బంది, కెప్టెన్ ఉన్నారు. అందరూ నాకు అండగా నిలబడ్డారు. కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. విరాట్ భాయ్, హార్దిక్ పాండ్యాతో సంభాషణలు జరిపా. వారు మద్దతుగా నిలిచారు. కీరన్ పొలార్డ్తో మాట్లాడినప్పుడు.. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. గత సీజన్లలో నేను బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడమని చెప్పాడు. కొన్ని వీడియోలను చూశా. అవి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి' అని ఇషాన్ కిషన్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












