
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (106: 50 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సూపర్ సెంచరీతో మెరువగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (69: 54 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అర్ధ శతకంతో రాణించడంతో పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 224 పరుగుల భారీ లక్ష్యం ఉంది. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ను రాహుల్, మయాంక్లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీరావడంతోనే రాయల్స్కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. మొదటి ఓవర్ నుంచే ఈ జోడీ బౌండరీల వరద పారించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. పవర్ప్లేలో ఐపీఎల్ 2020లో అత్యధిక స్కోరు (60/0) సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది.
రాహుల్ తెవాటియా వేసిన 8వ ఓవర్లో మయాంక్ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్ బాది 19 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మయాంక్ వీరవిహారం చేస్తుండటంతో పంజాబ్ 9 ఓవర్లలోనే 100 పరుగులు మార్క్ దాటింది. ఈ క్రమంలో సీజన్లోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేసింది. ఏ దశలోనూ ఈ జోడీ బ్యాటింగ్ జోరు తగ్గలేదు. ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు.
26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్.. మరో 19 బంతుల్లో దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో శతకం సాధించి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మయాంక్ నిలిచాడు. అంతకుముందు యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించగా.. ఆ తర్వాత స్థానంలో మయాంక్ నిలిచాడు.
మయాంక్, రాహుల్ జోడి తొలి వికెట్కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్గా ఔటయ్యాడు. టామ్ కరన్ బౌలింగ్లో మయాంక్ పెవిలియన్ చేరగా.. రాజ్పుత్ బౌలింగ్లో రాహుల్ ఔట్ అయ్యాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్లోనే రాహుల్ నిష్క్రమించాడు. ఇక చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), నికోలస్ పూరన్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.