RR VS GT: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ రాజస్థాన్ మూడో విజయాన్ని అందుకుంది. అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అందుకు కారణం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అసలు 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడటమంటేనే ఓ సంచలనం. అలాంటిది ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమంటే. అది కూడా సిక్సర్లతో విధ్వంసం సృష్టించడమంటే ప్రపంచంలోనే 8వ వింత అనే చెప్పాలి!
వైభవ్ చేసిన ఈ అద్భుత ప్రదర్శన వల్లే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తాజా మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనలో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (101: 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70*: 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
వైభవ్ ఊచకోత సాగిందిలా..
మొదటి ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్లో సిక్స్ బాది ఖాతా తెరిచిన వైభవ్.. నాలుగో ఓవర్లో తన అసలైన విశ్వరూపాన్ని బయటపెట్టాడు. ఇషాంత్ బౌలింగ్లో 6,6,4,0,6,4 బాదిన వైభవ్.. ఆ తర్వాతి ఓవర్లో రెండు సిక్స్లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలోనే వైభవ్ 17 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక కరీమ్ జనత్ వేసిన 10 ఓవర్లలో అయితే సూర్యవంశీ వీరబాదుడే. వరుసగా 6,4,6,4,4,6 అంటూ ఏకంగా 30 పరుగులు పిండాడు. అనంతరం ఆ తర్వాతి ఓవర్లోనే సిక్స్ బాది.. ఐపీఎల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు వైభవ్. తద్వారా ఐపీఎల్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత వేగంగా (35 బంతుల్లో) సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని..
వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడనే చెప్పాలి. యవ ఆటగాళ్లను ప్రోత్సాహించడంలో ద్రవిడ్ ఎప్పుడూ ముందుంటాడు. అలానే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కూడా యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలను కల్పిస్తూ వారిని తీర్చిదిద్దుతుంది. అలా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైభవ్.. ఇప్పుడు 35 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందరి చేత ఔరా అనిపించాడు. అంతర్జాతీయ స్థాయి హేమాహేమీ బౌలర్లను ఉతికారేస్తూ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడూ సెంచరీతో..
కాగా, వైభవ్ ఐపీఎల్ లో తన తొలి మ్యాచును లక్నో సూపర్ జెయింట్స్తో ఆడి.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచులో ఆడిన తొలి బంతికే సిక్స్ బాది అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో స్టంపవుట్ అయిన వైభవ్.. పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లడం అందరినీ మనసులను తాకిన విషయం తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం తనలోని కసిని, సత్తాను మైదానంలో సెంచరీ బాది చూపించాడు.
