గురువారం రాత్రి రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు. నోబాల్ స్పష్టత కోసమే ధోనీ మైదానంలోకి వెళ్లాడని ఫ్లెమింగ్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'మొదటగా అంపైర్ నోబాల్ ఇచ్చి ఆ నిర్ణయంను వెనక్కి తీసుకోవడంతో అందరం సందిగ్ధంలో పడ్డాం. అది నోబాలా? కాదా? అనే స్పష్టత కోసం ధోనీ మైదానంలోకి వెళ్లి అంపైర్లతో చర్చించాడు. నోబాలా? కాదా? అనే క్లారిటీ కోసం మాత్రమే అంపైర్లతో వాదనకు దిగాడు' అని ఫ్లెమింగ్ తెలిపాడు.
'ప్రస్తుతం ధోనీ చేసింది కరెక్ట్? కాదా? అనేది ప్రతి ఒక్కరు చర్చిస్తారు. ఈ విషయంలో ధోనీ కూడా పునరాలోచిస్తాడు. నో బాల్ విషయంలో అంపైర్లు అయోమయానికి గురవ్వడంతోనే ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ బాల్ పై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది, అటువంటి సమయంలో స్పష్టత అవసరం' అని ఫ్లెమింగ్ అన్నారు.