
RPSG డర్బన్ గ్రూప్.. CSA T20 లీగ్ కోసం తమ ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు సంతకం చేసిన మొదటి ఐదుగురు ఆటగాళ్లను ప్రకటించింది. క్వింటన్ డికాక్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ లాంటి స్టార్లు తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నట్లు ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని కూడా RPSG గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న CSA T20లీగ్లో డర్బన్ ఆధారిత ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు RPSG గ్రూప్ ఇటీవలే ప్రకటించింది. గత నెల ప్రారంభంలో జట్టుకు ప్రధాన కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ను కూడా తీసుకున్నారు.
డికాక్ ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనను కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంఛైజీ క్వింటన్ డి కాక్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్ మరియు రీస్ టాప్లీలను ప్రకటించింది. అలాగే అన్క్యాప్డ్ ప్రోటీస్ స్పిన్నర్ అయిన ప్రేనెలన్ సుబ్రాయెన్ కూడా తీసుకుంది. ఇక RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.. డర్బన్ జట్టులో ఎంపికైన ఆటగాళ్లను స్వాగతించారు. ఎంచుకున్న ఆటగాళ్లు జట్టుకు ఎంతో తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. MI కేప్టౌన్ జట్టును కొనుగోలు చేసి తమ మొదటి ఐదుగురు ప్లేయర్లను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబై ప్రకటన తర్వాత డర్బన్ ఫ్రాంచైజీని కొన్న ఆర్పీఎస్జీ నుంచి కూడా ఐదుగురు ప్లేయర్ల ప్రకటన వచ్చింది. ఎంఐ కేప్ టౌన్ జట్టులో స్టార్ ప్లేయర్లయిన రషీద్ ఖాన్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కరాన్, కగిసో రబడా, డెవాల్డ్ బ్రెవిస్ తొలి ఐదుగురు ప్లేయర్లుగా ఎంపికయ్యారు.