
దుబాయ్: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) అభిమానులకు శుభవార్త అందింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరగనున్న మ్యాచ్లో ఆడేందుకు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు అనుమతి లభించింది. అతడు కాంకషన్ టెస్ట్ క్లియర్ చేశాడు. తలకు గాయం కావడంతో ఇటీవల ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు స్మిత్ దూరమయ్యాడు. తొలి వన్డే ఆరంభానికి కొన్ని గంటల ముందే ప్రాక్టీస్ చేస్తుండగా.. తలకు దెబ్బతగలడంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభం అయినప్పటి నుంచి స్టీవ్ స్మిత్ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు. సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ నుంచి నేరుగా యూఏఈ చేరుకున్నాడు. తాజాగా కాంకషన్ టెస్ట్ క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్ 2020 ఆడదానికి రెడీగా ఉన్నాడు. అయితే రాజస్థాన్ ఆరంభ మ్యాచ్లకు స్మిత్ బరిలో ఉండటం లేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ క్లారిటీ ఇచ్చాడు.
'స్టీవ్ స్మిత్ అందుబాటులోకి రావడం అనేది మంచి శుభవార్త. రాజస్థాన్ ఆడే తొలి మ్యాచ్లో ఆడేందుకు స్మిత్ రెడీగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆటగాళ్లందరూ లీగ్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. స్మిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైంది. అన్ని విభాగాల్లో జట్టు బలంగా ఉంది. చెన్నైతో జరిగే పోరులో మా జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని ఆండ్రూ తెలిపాడు. 'ఇంగ్లండ్లో చివరి మూడు వన్డేలను ఆడలేదు. దుబాయ్లో కూడా కొంత విశ్రాంతి దొరికింది. నిన్న రన్నింగ్ చేసాను. ఈ రోజు నెట్స్లో ఆడాను' అని స్మిత్ తెలిపాడు.
రాజస్థాన్ ఆడే ఆరంభ మ్యాచ్కు ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ దూరం కానున్నాడు. అతని క్వారంటైన్ వ్యవధి ఇంకా పూర్తికాలేదు. మరో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. లీగ్లో ఆడడంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు జట్టులో చేరతాడో లేదో యాజమాన్యానికే తెలియని పరిస్థితి. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నఅతడు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరమైన విషయమే. రాజస్థాన్ ఈనెల 22న చెన్నైతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.