IPL 2025: వరుస విజయాలతో ఐపీఎల్ 2025లో దూసుకుపోతున్న ఆర్సీబీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుత విజయాలను సాధిస్తూ ప్లేఆఫ్స్ అవకాశాలను పదిలపరుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించే అవకాశం ఉందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణిస్తుండడంతో అది సాధ్యమవుతోందని వెల్లడించాడు. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం అయినట్లే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడుతోందని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తోందని చెప్పాడు. ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తీవ్ర పోటీ ఉంటుందన్నాడు. ముంబై జట్టు చాలా దూకుడుగా ఆడుతోందని చెప్పాడు. ఇదే విజయపరంపరను ముంబై కొనసాగిస్తుందే అనేది ప్రశ్నగా మిగిలిందన్నాడు. రాబోయే 3 మ్యాచ్ లు ముంబై జట్టుకు చాలా క్లిష్టమైనవని.. ఎలా ముందుకు సాగుతుందో చూడాలన్నాడు. ఆర్సీబీ జట్టు మాత్రం టైటిల్ ఫేవరేట్ అని చెప్పగలనని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా విషయాల్లో సరైన నిర్ణయాలను తీసుకుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అందులో ఫిల్ సాల్ట్ ను ఎంపిక చేసుకోవడం ఒకటని.. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి టాప్ ఆర్డర్ బాధ్యతను ఫిల్ సాల్ట్ అందుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ టాపార్డర్ దూకుడుగా ఆడుతుండడంతో మిడిలార్డర్ పై ఒత్తిడి లేకుండా పోయిందన్నాడు. ఇగ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ను చూస్తే చాలా బాగుందని.. జోష్ హేజిల్వుడ్ లాంటి బౌలర్ ను తీసుకోవడం అద్భుతమన్నాడు. దూకుడుగా ఆడుతూ ప్లేఆఫ్స్ కు దూసుకుపోయేందుకు ఆర్సీబీ సిద్ధమైందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు.