ఎన్నో ఏండ్ల చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె!! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. ఎట్టకేలకు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అబ్బాయిలకు అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ అమ్మాయిలు సాధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఛాంపియన్గా బెంగళూరు నిలిచింది.
ఆదివారం అరుణ్జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.

అయితే ఛేదన అంత సాఫీగా సాగలేదు. ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మంధాన (31; 39 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో) ఇన్నింగ్స్ను నిదానంగా మొదలుపెట్టారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడటంతో పవర్ప్లేలో 25 పరుగులే వచ్చాయి. కానీ ఏడో ఓవర్లో సోఫీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. రాధ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 18 పరుగులు సాధించింది.
కానీ సోఫీని శిఖా పాండే ఔట్ చేసి ఢిల్లీని తిరిగి పోటీలోకి తెచ్చింది. మరోవైపు ఎలీస్ పెర్రీ, స్మృతి జాగ్రత్తగా ఆడటంతో ఆర్సీబీకి కావాల్సిన రన్రేటు క్రమంగా పెరిగింది.శిఖా నాలుగు ఓవర్లు వేసి 10 పరుగులే ఇవ్వడం విశేషం. అయితే స్మృతి, ఎలీస్ గేర్ మార్చి దూకుడు పెంచారు. స్మృతి ఔటైనప్పటికీ రిచా ఘోష్తో కలిసి ఎలీస్ లక్ష్యాన్ని కరిగించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు శుభారంభం లభించింది. షెఫాలీ వర్మ బౌండరీలతో హోరెత్తించింది. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. మెగ్ లానింగ్ (23; 23 బంతుల్లో) నిలకడగా ఆడటంతో పవర్ప్లేలో ఢిల్లీ 61 పరుగులు చేసింది. అయితే ఓ దశలో 64/0తో టాప్లో నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత 49 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.
సోఫీ మొలినెక్స్ వేసిన 8వ ఓవర్ ఢిల్లీ ఇన్నింగ్స్ను కుదేలు చేసింది.సోఫీ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టింది. హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ నాలుగు బంతుల వ్యవధిలో షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (0), అలీస్ క్యాప్సీ (0)ను పెవిలియన్కు చేర్చింది. ఆ తర్వాత మ్యాచ్ ఆర్సీబీ కంట్రోల్లోకి వెళ్లింది. పవర్ప్లే తర్వాత ఏడు ఓవర్లలో ఢిల్లీ కేవలం 19 పరుగులే చేసింది. డ్రింక్స్ బ్రేక్ అనంతరం గేర్ మారుద్దామనుకున్న ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఛాన్స్ ఇవ్వలేదు.
శ్రేయంక పాటిల్ నాలుగు వికెట్లు, సోఫీ మూడు, శోభన రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ, లానింగ్, రాధా యాదవ్ (12; 9 బంతుల్లో), అరుంధతి (10; 13 బంతుల్లో) మినహా మిగిలినెవరూ రెండంకెల స్కోరును అందుకోలేదు.