
క్రికెట్లో గాయాలు చాలా సహజం. కానీ ఒక్కోసారి ఆటగాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో గాయాలపాలు అవ్వాల్సి వస్తుంది. తాజాగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కూడా చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ ఈ మ్యాచ్లో విజయం మాత్రం సౌతాఫ్రికానే వరించింది.
భారీ లక్ష్య ఛేదనలో బరిలో దిగిన సఫారీలకు కూడా అదిరిపోయే ఆరంభం లభించింది. క్వింటన్ డీకాక్ 43 బంతుల్లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అకీల్ హొస్సేన్ వేసిన బంతిని లాంగాఫ్ వైపుగా డీకాక్ బాదాడు. దీన్ని ఆపేందుకు విండీస్ కెప్టెన్ రావ్మెన్ పావెల్ వేగంగా పరుగు తీశాడు. డైవ్ చేస్తే బంతి బౌండరీ వెళ్లకుండా ఆపే అవకాశం కనిపించింది. కానీ పావెల్ డైవ్ చేయలేదు. ఎందుకంటే బంతిని పట్టుకోవడానికి ఐదేళ్ల పసివాడు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఉన్నాడు.
తను డైవ్ చేస్తే ఆ పసివాడిని ఢీకొట్టడం ఖాయమని పావెల్కు అర్థమైంది. దీంతో డైవ్ చేయకుండా పరుగును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే చాలా వేగంగా వస్తుండటంతో అతను పూర్తిగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే పిల్లవాడికి తగలకుండా పసివాడి పైనుంచి ముందుకు దూకాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న ఎల్ఈడీలను బలంగా తాకాడు. అక్కడితో ఆగకుండా వాటి పై నుంచి అవతలకు వెళ్లి, అక్కడ ఉన్న స్టీల్ పైపులను కూడా ఢీకొట్టాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ గాయంతో పావెల్ వెంటనే మైదానంలోకి రాలేకపోయాడు. బౌండరీ లైన్ పక్కనే పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. జట్టు ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స అందించారు. ఆ తర్వాత కాసేపటికి తేరుకున్న అతను మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్లో రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ సహా సఫారీ బ్యాటర్లంతా రాణించడంతో ఆ జట్టు విజయం సాధించింది. ఈ టీ20 మ్యాచ్లో ఏకంగా 517 పరుగులు నమోదవడం గమనార్హం.