హైదరాబాద్: బుధవారం (నవంబర్ 1) నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరిస్ను చేజార్చుకున్న న్యూజిలాండ్ కనీసం టీ20నైనా దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా టీ20 జట్టులో మార్పులు చేసింది.
భారత్తో జరగనున్న మూడు టీ20ల సిరిస్కు న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు మంగళవారం న్యూజిలాండ్ ప్రధాన కోచ్ మైక్ హెసన్ వెల్లడించారు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో అస్లే గాయపడ్డాడు.
దాంతో అతను టీ 20 సిరీస్కు దూరం కావాల్సి వచ్చింది. అతడి స్ధానంలోనే రాస్ టేలర్ను జట్టులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో 19 నెలల తర్వాత రాస్ టేలర్ కివీస్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే సిరీస్లో టేలర్ ఫామ్ను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు అతన్ని టీ20 సిరీస్కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

'టేలర్ టీ20 మ్యాచ్లు ఆడి చాలా కాలమైంది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడిన తర్వాత అతడు మ్యాచ్లు ఆడలేదు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఒక మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఫామ్లో ఉన్నాడు' అని కోచ్ తెలిపాడు.
'మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అస్లే దూరం కావడం చాలా బాధగా ఉంది. టీ20 ర్యాంకింగ్స్లో మా జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో భారత్పై మాకు మెరుగైన రికార్డు ఉంది. భారత్ను సొంతగడ్డపై ఎదుర్కోవడం కష్టమే. అయినా, ఈ సిరీస్లో విజయం కోసం కష్టపడతాం' అని అన్నాడు.
భారత్తో టీ20 సిరిస్కు న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), మిచెల్ సాంత్నార్, ఇష్ సోథీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రీ, గ్లెన్ ఫిలిప్స్