
నాగాలాండ్: క్రికెట్ మ్యాచ్లలో ఓ ఆటగాడు సెంచరీ చేస్తే ఆ రికార్డు అతని వ్యక్తిగత ఖాతాలోకి చేరుతుంది. ఆ మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్ అయినా, లిస్ట్-ఏ క్రికెట్ అయినా సెంచరీ బ్యాట్స్మన్ ఖాతాలో చేరిపోతుంది. అయితే తాజాగా ఓ బ్యాట్స్మన్ సెంచరీ బాదినా.. ఆ రికార్డు మాత్రం అతని ఖాతాలో చేరలేదు. అదేంటి? సెంచరీ చేసినా.. ఎందుకు అతని ఖాతాలోకి చేరలేదు అని అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే.
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రౌండ్-1లో సెప్టెంబర్ 24న నాగాలాండ్, మణిపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నాగాలాండ్ కెప్టెన్ రోంగ్సేన్ జోనాథన్ సెంచరీ చేసాడు. లిస్ట్-ఏ క్రికెట్లో జోనాథన్కు ఇదే తొలి సెంచరీ కావడంతో.. మైదానంలో జోనాథన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు. నాగాలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన మణిపూర్ జట్టు 8.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ను కొనసాగించడం సాధ్యం కాలేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. ఇక ఆ మ్యాచ్తో పాటు వర్షం కారణంగా రద్దయిన అన్ని మ్యాచ్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. మ్యాచ్లు రీ షెడ్యూల్ చేయడంతో.. జోనాథన్ చేసిన సెంచరీ లెక్కల్లోకి రాలేదు.
ఈ ఘటనతో రోంగ్సేన్ జోనాథన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 'ఈ సంఘటన తీవ్రంగా వేధిస్తుంది. నా సెంచరీని దోచుకున్నారు. దాదాపు 60 శాతం మ్యాచ్ పూర్తియిన తర్వాత.. మ్యాచ్ను రీ షెడ్యూల్ ఎలా చేస్తారు. రీ షెడ్యూల్పై నాకు అవగాహన ఉంది. కానీ.. రికార్డులను రీ షెడ్యూల్ పేరుతో ఎలా తొలగిస్తారు. మేము చాలా కష్టపడతాం. తొలి సెంచరీ రికార్డు వృథా కావడం చాలా బాధగా ఉంది. బీసీసీఐకి లేఖ రాశా. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీంను వివరణ అడిగా. కానీ ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. నార్త్-ఈస్ట్ నుంచి వచ్చిన క్రికెటర్లపై చులకన భావం ఉంది. అందుకే నేను రాసిన లేఖకు వివరణ ఇవ్వలేదు' అని జోనాథన్ అన్నాడు.