రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వివాదంపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ సారథ్యంలో ఆడినంత మాత్రాన రోహిత్ విలువ ఏం తగ్గిపోదని అన్నాడు. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్కు వచ్చిన హార్దిక్ జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.
అయితే గత పది సీజన్లలో అయిదు టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేగాక ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్సీ మార్పులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని, హార్దిక్ కెప్టెన్సీ డిమాండ్తోనే ముంబైకి తిరిగొచ్చాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హార్దిక్కు మైదానంలో, వెలుపల అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

దీనిపై ఇటీవల కామెంట్రీలో రీఎంట్రీ ఇచ్చిన నవజ్యోత్ సింగ్ మాట్లాడాడు. ''అయిదుగురు భారత కెప్టెన్లు కలిసి ఆడిన జట్టులో నేను ఆడాను. కపిల్ దేవ్, దిలీప్ వెంగసర్కర్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రితో కలిసి ఆడాను. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే దేశం కోసం ఆడుతున్నామని ప్రేరణ ఉంది. కాబట్టి హార్దిక్ సారథ్యంలో ఆడటంతో రోహిత్ స్థాయి తగ్గదు''
''ధోనీ తన కెప్టెన్సీని రుతురాజ్కు ఇచ్చేశాడు. ముంబై ఇండియన్స్లో కూడా అదే జరిగి ఉంటుంది. ముంబై రోహిత్కు మూడేళ్లు ఇచ్చింది (2020 నుంచి). కానీ మరో టైటిల్ దక్కలేదు. కాబట్టి ఆ పని కోసం మరొకరి తీసుకోవాలనుకుంది. దాన్ని మనం అంగీకరించాలి. అయితే రోహిత్ శర్మ, ధోనీ గొప్ప ఆటగాళ్లు. మరగుజ్జు పర్వతంపై ఉన్నా మరగుజ్జే అవుతాడు. బావిలో ఉన్నా దేవుడు దేవుడే అవుతాడు'' అని నవజ్యోత్ సింగ్ పేర్కొన్నాడు.

కాగా, ఇవాళ ఉప్పల్ వేదికగా జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. తమ తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో హైదరాబాద్, గుజరాత్ చేతిలో ముంబై ఓటమిపాలైన సంగతి తెలిసిందే.