
నాగ్పూర్ టెస్టులో ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. ఆ దేశ మీడియా, మాజీలపై అసహనం వ్యక్తం చేసింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ డైరెక్ట్గానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. తొలి టెస్టులో భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మను రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అశ్విన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రోహిత్.. ఆస్ట్రేలియా మాజీలు, నిపుణులు, మీడియాను ఏకిపారేశాడు.
'ప్రస్తుతం సోషల్ మీడియాలో పిచ్ మీద చర్చ హాట్టాపిక్గా మారింది. మరీ ముఖ్యంగా ఇక్కడకు వచ్చే దేశాలకు ఇది చాలా ఫేవరెట్ టాపిక్ అయింది. అయితే నువ్వుకానీ, మిగతా వాళ్లు కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్క బంతి కూడా ఎడ్జ్ తీసుకొని సిల్లీ పాయింట్ వరకూ వెళ్లలేదు. మీరు పెద్ద ట్రబుల్లో ఉన్నట్లు కూడా కనిపించలేదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? జస్ట్ మంచి బ్యాటింగ్ అంటావా? లేదంటే మనం వేరే పిచ్పై ఆడామా?' అని అశ్విన్ ప్రశ్నించాడు. ఇలా ఆసీస్ను పరోక్షంగా అతను ఎగతాళి చేయడాన్ని అర్థం చేసుకున్న రోహిత్.. చాలా సీరియస్గా సమాధానం ఇచ్చాడు.

'అదే పిచ్పై ఆడాం. డ్రెస్సింగ్ రూంలో మనం మాట్లాడుకున్నట్లే.. ఈ పిచ్పై నువ్వు ఏం చెయ్యగలవు? అనే నైపుణ్యం ఇక్కడ ఇంపార్టెంట్. పిచ్ గురించి ఇంత పెద్ద చర్చ ఎందుకు జరిగిందో నాకైతే అసలు అర్థం కావడం లేదు. అసలు మాట్లాడుకోవాల్సింది ఆటగాళ్ల నైపుణ్యాల గురించి.. కానీ అది జరగకపోవడం నిజంగా బాధాకరం' అని రోహిత్ చెప్పాడు. కాగా, చాలా మంది మాజీలు ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించారు. తమకు దక్కిన మంచి ఆరంభాలను ఉపయోగించుకోలేదని, అనవసర షాట్లు ఆడి పెవిలియన్ చేరారని స్టీవ్ స్మిత్, లబుషన్ వంటి వాళ్లను తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే.