స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కాదని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ముంబయి ఇండియన్స్ జట్టులో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయని వార్తలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ యాజమాన్య నిర్ణయాన్ని తప్పుపడుతూ పరోక్షంగా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రోహిత్ను సపోర్ట్ చేస్తూ వాళ్లు పోస్ట్లు చేశారా అనే విషయంపై ఆధారాలు లేవు.
కానీ తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ చేసిన కామెంట్స్ ముంబయి ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలేం జరిగిదంటే.. ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని తప్పించడానికి గల కారణాలను వివరించాడు. ఇది క్రికెట్కు సంబంధించిన నిర్ణయేమని, వ్యక్తిగత నిర్ణయాలు కాదని అన్నాడు. రోహిత్ అసాధారణమైన ప్లేయర్ అని తెలిపాడు. కానీ రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు.

అయితే ఈ ఇంటర్వ్యూ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిపై రితిక స్పందించారు. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అంటూ రితక కామెంట్ చేశారు. దీంతో మరోసారి ముంబయి ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఉద్దేశపూర్వకంగానే ఫ్రాంచైజీ వేటు వేసిందని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు సార్లు జట్టును ఫైనల్స్కు చేర్చడమేగాక, ఒకసారి టైటిన్ అందించిన కెప్టెన్ హార్దిక్ను గుజరాత్ ఫ్రాంచైజీ ఎలా వదులుకుందని అందరూ ఆశ్చర్యపోయారు. మరోవైపు కెప్టెన్సీ ఇస్తాననే హామీతోనే హార్దిక్ తిరిగి ముంబయి గూటికి చేరుకున్నాడని, అతడి కోసం ముంబయి ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించిందనే వార్తలు వచ్చాయి. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ అయిదు సార్లు టైటిల్ను సాధించింది.