సియెట్ అవార్డుల ప్రదానోత్సవంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును అందుకున్న రోహిత్ టీ20 వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడాడు. వెస్టిండీస్ వేదికగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ను రోహిత్ సారథ్యంలో భారత జట్టు గెలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఆటగాళ్లతో పాటు ముగ్గురి ప్రధాన మద్దతుతో ప్రపంచకప్ను గెలిచామని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. అప్పటి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా గొప్ప మద్దతుతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు. వాళ్లు తనకెంతో మద్దతు ఇవ్వడంతో తన కెప్టెన్సీలో టీమిండియా కప్ను ముద్దాడిందని వివరించాడు.

''గణాంకాలు, ఫలితాలు గురించి ఆలోచించకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేలా జట్టులో మార్పు తీసుకురావడం నా కల. జట్టుకు కావాల్సింది అదే. దీని కోసం మూడు స్తంభాలు.. జై షా, ద్రవిడ్, అగార్కర్ల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఈ మద్దతు వల్లే సాధించా. అలాగే ఆటగాళ్ల కృషిని మరువొద్దు. వివిధ క్లిష్ట సమయాల్లో గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు'' అని రోహిత్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్ విజయానందం గురించి రోహిత్ మాట్లాడాడు. ''ఆ అనుభూతి ప్రతి రోజు కలిగేది కాదు. దాని కోసం మేమేంతో ఆశించాం. ఇక వరల్డ్ కప్ విజయం మాకెంత ముఖ్యమైందో దేశం మొత్తాని అంతే ముఖ్యమైంది. కప్ను దేశానికి తీసుకుని రావడం, ప్రజలతో కలిసి సంబరాలు చేసుకోవడం గొప్ప అనుభూతి. ఇది మాటల్లో వర్ణించలేనిది'' అని రోహిత్ శర్మ అన్నాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ విజయానంతరం రోహిత్ శర్మ పొట్టిఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టు ఫార్మాట్లో జట్టును నడిపిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్కు విజేతగా నిలపడానికి ప్రయత్నిస్తానని రోహిత్ తెలిపాడు.