ఐపీఎల్ 2025 తాజాగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రాజత్ పటీదార్.. తన వ్యూహాత్మక నిర్ణయంతో ముంబయి ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ పడగొట్టడంలో సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్ ఫామ్ కోల్పోయిన రోహిత్ను ఎదుర్కోవడానికి.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్ను రంగంలోకి దింపాడు. అందుకు తగ్గట్టే దయాల్ కూడా తన అద్భుతమైన ఇన్స్వింగర్ బంతితో రోహిత్ ను పెవిలియన్ పంపాడు.
రోహిత్ మంచి మనసు..
దీంతో ఈ మ్యాచ్లో మళ్లీ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ.. రోహిత్ శర్మ కేవలం 17 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ అభిమానులు మరోసారి నిరాశలో మునిగిపోయారు. అయితే రోహిత్ మాత్రం మ్యాచ్ అయ్యాక హుందాగా ప్రవర్తించాడు. ఓ ఆటగాడిగా తన గొప్ప మనసు చాటుకున్నాడు. స్పోర్ట్స్మన్షిప్ను ప్రదర్శించాడు. తనను ఔట్ చేసిన యశ్ దయాల్ వచ్చి ఆటోగ్రాఫ్ అడగగా.. కాదనకుండా అభిమానంతో ఇచ్చాడు. 'బెస్ట్ విషెస్' అంటూ RCB జెర్సీపై సంతకం చేసి ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోను దయాల్ "అంతకుమంచిన అభిమానంతో, మర్చిపోలేని మూమెంట్" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇదేమీ పెద్ద విషయం కాదు..
మ్యాచ్ తర్వాత ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మాహేల జయవర్ధనె.. రోహిత్ను యశ్ దయాల్ ఔట్ చేయడం గురించి మాట్లాడుతూ.. "రైట్హ్యాండెడ్ బ్యాటర్లకు ఎడమచేతి పేసర్లు కాస్త ఇబ్బంది కలిగించడం సహజమే. ఎంతో మంది ఓపెనింగ్ బ్యాటర్లకు ఇది ఎప్పటినుంచో ఉండేదే. ఎన్నో జట్లు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాయి. అయినా, నాకు రోహిత్ పై నమ్మకముంది. అతడు ఈ విషయంలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను అనుభవజ్ఞుడైన ఆటగాడు. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదు. రోహిత్ మంచి ఆరంభం ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. కొన్ని మంచి షాట్లు కూడా ఆడాడు. యశ్ దయాల్ వేసిన బంతి అద్భుతంగా స్వింగ్ అయ్యింది. ఇలాంటి స్థాయిలో ఆట ఆడినవాళ్లు కొన్నిసార్లు బౌలర్లను కూడా మెచ్చుకోవాలి. నేను ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించను. అయినా, రోహిత్ తప్పకుండా దీనిపై మరింత కష్టపడి, దీన్ని అధిగమిస్తాడు." అని పేర్కొన్నాడు.