మరో నెల రోజుల్లో టీ20 మహా సమరం ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. 2007లో మొదలైన ఈ పొట్టి కప్ సమరంలో భారత్ తొలి విజేతగా నిలిచింది. సీనియర్లు లేకుండా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వెళ్లిన యువ టీమిండియా ఛాంపియన్గా నిలిచింది.
పసికూనలా బరిలోకి దిగిన భారత్ సమష్టిగా సత్తాచాటి విశ్వ విజేతగా నిలిచింది. అయితే టీమిండియా ప్రపంచకప్ గెలవడానికి ధోనీ కెప్టెన్సీ, ఫైనల్లో గౌతమ్ గంభీర్ స్పెషల్ ఇన్నింగ్స్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుత బౌలింగ్, యువరాజ్ సింగ్ సంచలన ప్రదర్శ కారణాలుగా అభిమానులు, విశ్లేషకులు చెబుతుంటారు.

కానీ భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడానికి రోహిత్ శర్మ ప్రత్యేక కారణమని గంభీర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో రోహిత్ ఇన్నింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. హిట్ మ్యాన్ 16 బంతుల్లో అజేయంగా 30 పరుగులు సాధించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
''టీ20 వరల్డ్ కప్-2007 ఫైనల్లో నా ఇన్నింగ్స్, ఇర్ఫాన్ పఠాన్ గొప్ప స్పెల్ గురించి ప్రజలు మాట్లాడుతుంటారు. కానీ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తుదిపోరులో ఎంతో ప్రత్యేకమైనది. అతను సాధించిన పరుగులు టీమిండియాకు ఎంతో విలువైనవి'' అని గంభీర్ పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 157 పరుగులు చేసింది. గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అనంతర ఛేదనలో పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.
కాగా, తొలి టీ20 ప్రపంచకప్లో సత్తాచాటిన రోహిత్ శర్మ మరో టీ20 కప్ను భారత్కు అందించాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత మరో మెగాటోర్నీకి అందుబాటులో ఉండటం దాదాపు అనుమానమే. ఈ నేపథ్యంలో తన కెరీర్ను ప్రపంచకప్తో ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.