మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి కప్ టోర్నీలోనూ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశ నుంచి సూపర్-8కు చేరుకోవడానికి టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సిన పని లేదు. ఎందుకంటే గ్రూప్-ఎలో పాకిస్థాన్ మినహా మిగిలిన జట్లు అన్నీ పసికూనలే.
గ్రూప్ స్టేజ్లో ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లతో భారత్ తలపడనుంది. అయితే సూపర్-8లో బలమైన జట్లతో టీమిండియా పోటీపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ల్లో విజయఢంకా మోగించాలంటే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తప్పక చెలరేగాలి. కానీ రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన పెరిగింది.

పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడే రోహిత్ శర్మ భారత్కు ప్రధాన అస్త్రం. కానీ ఐపీఎల్లో గత అయిదు మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవుతున్నాడు. రెండంకెల స్కోరును అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో తొలి ఏడు మ్యాచ్ల్లో రోహిత్ సత్తాచాటాడు. 45 సగటు, 164 స్ట్రైక్రేటుతో 297 పరుగులు చేశాడు.
కానీ చివరి అయిదు మ్యాచ్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. అయిదు మ్యాచ్ల్లో కలిపి 33 పరుగులే చేశాడు. ఆరు సగటు, 94 స్ట్రైక్రేటుతో క్రీజులో కొద్దిసేపు మాత్రమే నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. రోహిత్ ఫామ్ భారత్కు బాధ కలిగిస్తుందని, అతని తిరిగి లయ అందుకోవడం టీమిండియా, ముంబై ఇండియన్స్కు ఎంతో ముఖ్యమని అన్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ గురించి విశ్లేషిస్తూ.. ''కొత్త బంతితో ఇషాన్ కిషన్ను జేన్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ను ప్యాట్ కమిన్స్ బోల్తాకొట్టించాడు. తొలి ఆరు మ్యాచ్ల్లో, చివరి అయిదు మ్యాచ్ల్లో రోహిత్ ప్రదర్శనలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయం. నిజాయతీగా చెప్పాలంటే, రోహిత్ ఫామ్ ముంబై ఇండియన్స్, ఇండియన్స్కు ఎంతో అవసరం'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.