Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 16వ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు సరదాగా గడుపుతూ కనిపించారు. ఈ సమయంలో రోహిత్ శర్మ, లక్నో మెంటర్ జహీర్ ఖాన్ మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ తో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఆ వీడియోలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను వెనుక నుంచి హగ్ చేసుకోవడం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను చూపించే విధంగా ఉన్నప్పటికీ.. పంత్ వచ్చే ముందు రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో సీరియస్గా మాట్లాడడం కనిపించింది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో మాట్లాడుతూ.. "చేయాల్సినప్పుడు అన్నీ చేశాను.. ఇప్పుడు నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు" అని రోహిత్ అన్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో.. రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ముంబై ఇండియన్స్ గురించే అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. గత సీజన్లో ఐపీఎల్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మను తప్పించి ఆయన స్థానంలో హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా ముంబై యాజమాన్యం నియమించింది. ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా హర్ట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. రోహిత్ శర్మ ముంబై టీమ్ నుంచి బయటకు కూడా వచ్చేస్తాడంటూ పుకార్లు కూడా వచ్చాయి.

కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ శర్మ ఆగ్రహంతో ఉన్నట్లు అతని మాటలను బట్టి అర్థం అవుతోంది. కెప్టెన్గా ఉన్న సమయంలో ముంబై టీమ్ కోసం ఏం చేయాలో అది సరిగ్గా చేశానని.. ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదని హిట్ మ్యాన్ ఆ వీడియోలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి ఇక తనకు సంబంధం లేదని.. బ్యాటింగ్ ఒక్కటే తన పని అనేలా హిట్ మ్యాన్ మాటలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో రోహిత్ శర్మ మరీ ఇంత స్వార్థపరుడా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.