మార్చి వచ్చేసింది. ఐపీఎల్ సెగ మొదలైంది. ఐపీఎల్లోని జట్ల బలాబలాల గురించి క్రికెట్ మాజీలు, విశ్లేషకులు లోతుగా చర్చిస్తున్నారు. ఆయా జట్లు టైటిల్ గెలిచే అవకాశాలు, బలహీనతల గురించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ గురించి భారత మహిళా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడారు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై ప్రత్యేకంగా విశ్లేషించరు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను ముంబయి యాజమాన్యం అప్పగించిన సంగతి తెలిసిందే. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ స్థానంలో హార్దిక్కు సారథి బాధ్యతలు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎవరైనా సరే జట్టు తరఫున ఆటగాడిగానే బరిలోకి దిగాలని, కెప్టెన్గా రావాలనుకోవద్దని అంజుమ్ చోప్రా పేర్కొన్నారు.

''ఆటగాళ్ల బాధ్యత మ్యాచ్ను ఆడటం. ఓ ప్లేయర్గా మాత్రమే జట్టుతో కలిసి నడవాలి. కెప్టెన్గా భావించి ఎప్పటికీ అడుగుపెట్టకూడదు. ప్రాంచైజీ తీసుకునే నిర్ణయాలు, బయటి విషయాలు భిన్నంగా ఉంటాయి. వాళ్లకు వాళ్ల కారణాలు ఉంటాయి. అయితే రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ఆటగాడిని, కెప్టెన్ను భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ ఏదో ఒక రోజు అది జరుగుతుంది''
''రోహిత్ శర్మకు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినప్పుడు అది సులభమైన నిర్ణయం కాదు. ఆ సమయంలో చాలా మంది దిగ్గజ క్రికెటర్లు, అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. కానీ రోహిత్కు కెప్టెన్సీ అందించారు. అతని సామర్థ్యాన్ని చూసి ముంబై ఫ్రాంచైజీ సారథి బాధ్యతలు కట్టబెట్టింది. ఆ తర్వాత రోహిత్ విజయవంతమయ్యాడు. అయిదు టైటిళ్లు సాధించాడు''
''ఇక్కడ బయట నుంచి మనం ఎలా ఆలోచిస్తామనేది ముఖ్యం కాదు. ఫ్రాంచైజీలు ఎలా ఆలోచిస్తున్నాయనేది కీలకం.ఈ విషయాల్లో భావోద్వేగాలకు లోనవ్వదు. జట్టు వర్తమానం,భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు'' అని అంజుమ్ చోప్రా చెప్పింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.