రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టెస్టు క్రికెట్ ఆడాలనే కసి ఉన్న ఆటగాళ్లకే భారత జట్టులో అవకాశాలు వస్తాయని రోహిత్ పేర్కొన్న విషయం తెలిసిందే. టెస్టుల కంటే ఐపీఎల్పైనే ఆసక్తి చూపించే ఆటగాళ్లను రోహిత్ పరోక్షంగా హెచ్చరించాడు.
''టెస్టు ఫార్మాట్ అత్యంత కఠినమైంది. టెస్టు క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లలో కసి ఉండాలి. అలా ఆకలితో ఉన్న వారికే అవకాశాలు వస్తాయి. లేని వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో అసలు అర్థమే లేదు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లలో సుదీర్ఘ ఫార్మాట్ పట్ల తపన కనిపిస్తోంది. అయితే టెస్టుల్లో అవకాశాలు తక్కువగానే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విఫలమైన వాళ్లు బయటికి వెళ్లిపోవాల్సిందే'' అని రోహిత్ చెప్పాడు.

రోహిత్ వ్యాఖ్యలతో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఏకీభవించాడు. గత కొన్నేళ్లుగా తాను కూడా ఇదే చెబుతున్నాని గవాస్కర్ పేర్కొన్నాడు. ''రోహిత్ చెప్పింది కచ్చితంగా కరెక్టే. టెస్టు క్రికెట్ ఆడాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలి. ఈ విషయం గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నా. భారత క్రికెట్ వల్లే ఆటగాళ్లు ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి భారత క్రికెట్కు కొంచెం అయిన విధేయత చూపించాలి. అయితే కొందరు ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలని భావించట్లేదనకుంటా. ఆ విషయంలో ఇక మీరు ఏం చేయలేరు'' అని గవాస్కర్ తెలిపాడు.
మానసిక అలసట కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ను, అలాగే రంజీ ట్రోఫీలో పాల్గొనని సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లను ఉద్దేశించి రోహిత్, గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషన్ జట్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడు తిరిగి భారత జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పినప్పటికీ ఇషాన్ లెక్కచేయలేదు. అంతేగాక టీమిండియాకు దూరంగా ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లంతా రంజీ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఇషాన్ కిషన్ రంజీలో బరిలోకి దిగలేదు.
మరోవైపు బీసీసీఐ ఆదేశాలతో రుతురాజ్ గైక్వాడ్ రంజీట్రోఫీ ఆడాడు. కానీ దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ ఆడలేదు. తొలుత గాయాల సాకు చూపించి శ్రేయస్ అయ్యర్ తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత శ్రేయస్ అడ్డంగా దొరికిపోయాడు. మ్యాచ్ ఆడలేని తీవ్ర గాయాలు శ్రేయస్కు లేవని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. ఐపీఎల్లో సత్తాచాటాలనే ఈ యువ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్పై ఆసక్తి చూపట్లేదని విమర్శలు వస్తున్నాయి.