
హైదరాబాద్: రితికా సజ్దేహ్.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండరు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ సతీమణినే రితికా. భారత్ ఎక్కడ మ్యాచ్ ఆడినా.. ఆమె స్టేడియంలో సందడి చేస్తారు. జట్టుకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. ఇక రోహిత్ సెంచరీ చేస్తే ఆమె ఆనందానికి హద్దే ఉండదు. అయితే నేడు రితికా 33వ జన్మదినం జరుపుకొంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, స్నేహితులు బర్త్డే విషెష్ చెపుతున్నారు.
'హిట్మ్యాన్' రోహిత్ శర్మ సోమవారం సతీమణి రితికా సజ్దేహ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేకంగా విష్ చేశాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుకు వాళ్లిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ జంట డిసెంబర్ 13న తమ ఐదో వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకొంది. అప్పుడు కూడా హిట్మ్యాన్ రితికతో కలిసి దిగిన ఐదు ఫొటోలను ఇన్స్టాలో పోస్టు చేశాడు.
రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్వారంటైన్లో ఉన్నాడనే సంగతి తెలిసిందే. ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని.. ఇటీవలే అక్కడికి వెళ్లాడు. ఆస్ట్రేలియాలో అక్కడి ప్రభుత్వం కరోనా వైరస్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తుండడంతో క్వారంటైన్ సమయం గడుపుతున్నాడు. తొలి టెస్టులో ఘోర పరాభవం చెందడంతో రోహిత్ వీలైనంత త్వరగా జట్టులో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్కు తిరిగి వస్తుండడంతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సైతం గాయం కారణంగా మిగతా టెస్టులకు దూరమయ్యాడు. ఇక ఓపెనర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు సైతం తొలి టెస్టులో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రోహిత్ శర్మ చేరిక జట్టుకు ఎంతో అవసరంగా మారింది. రోహిత్ రాక కోసం మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం ఎదురు చూస్తున్నాడు. హిట్మ్యాన్ అందుబాటులోకి వస్తే.. నేరుగా ఓపెనర్గా దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.