
భారత్పై వన్డే సిరీస్ నెగ్గాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అదృష్టం ఆసీస్ను వరించింది. చెపాక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచాడు. పిచ్ కొంత డ్రైగా ఉందని అభిప్రాయపడిన అతను.. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు కూడా తెలియజేశాడు. గత వన్డేలో కోహ్లీని అవుట్ చేసిన నాథన్ ఎల్లీస్ స్థానంలో ఆష్టన్ అగర్ ఆడుతున్నాడని, అలాగే కామెరూన్ గ్రీన్ ఆరోగ్యం బాగలేకపోవడంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ను తీసుకున్నామని తెలిపాడు.
టాస్ గెలిచినా తను ముందుగా బౌలింగ్ ఎంచుకునే వాడినని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో ఆడటం ఎప్పుడూ గొప్ప అనుభూతి అని చెప్పిన రోహిత్.. జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. నలుగురు పేసర్లతో బరిలో దిగాలని ముందుగా అనుకున్నామని, అయితే అలా కాకుండా పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉందనే ఆలోచన వచ్చిందన్నాడు. దీంతో తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, రెండో వన్డే ఆడిన జట్టుతోనే ఈసారి కూడా బరిలో దిగుతున్నామని వెల్లడించాడు.
వన్డే వరల్డ్ కప్ ముందు ఈ రెండు బలమైన జట్లు చివరగా తలపడే మ్యాచ్ ఇదే కావడంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి భారత గడ్డపై వన్డే సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఆసీస్ను ఓడించి వన్డే ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఏదేమైనా టీమిండియా టాపార్డర్ విఫలమైతే భారత్కు మళ్లీ కష్టాలు తప్పవు. మరి ఈ మ్యాచ్లో అయినా టాపార్డర్ రాణిస్తుందేమో చూడాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టొయినిస్, షాన్ ఆబాట్, మిచెల్ స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా