మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ సీజన్ ముగిసిన వెంటనే జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరికీ ఐపీఎల్ చాలా కీలకం కానుంది. తమ జాతీయ జట్లలో స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. బీసీసీఐతో పాటు ఇతర దేశ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లపై ఐపీఎల్లో ఓ కన్నేసి ఉంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్య వివాదం కూడా ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చుతుంది. ముంబై కెప్టెన్సీ మార్పు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ను విమర్శిస్తున్నారు.

అయితే ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ భవిష్యత్ గురించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వివాదానికి రోహిత్-హార్దిక్ ముగింపు పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పాడు. అలాగే టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ బాధ్యతల గురించి భజ్జీ మాట్లాడాడు. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో ఉండే అంచనాల వల్ల కాస్త ఒత్తిడి ఉంటుందని, కానీ రోహిత్ దాన్ని అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. సీనియర్లు అందుబాటులో లేకపోయినా యువ క్రికెటర్లను సరైన దిశలో నడిపి ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్ మంచి ఫలితాలు రాబట్టాడని కొనియాడాడు.
''వరల్డ్ కప్లో మన జట్టుపై భారీ అంచనాలు పెట్టుకుంటాం. మ్యాచ్లు విజయం సాధించాలని, ట్రోఫీలు గెలవాలని కోరుకుంటాం. టీమిండియాలో అపారమైన నైపుణ్యం ఉంది. వేలు ఎత్తి చూపడానికి ఏ లోపం కనిపించట్లేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అంతా బాగుంది. అయితే ప్రపపంచకప్లో ఆలోచన ధోరణీ మార్చుకోవాలి. గతంలో చేసిన తప్పులు సరిద్దుకొని ముందుకు సాగాలి. ఓ మంచి జట్టు తప్పులను రిపీట్ చేయదు. మన జట్టు టైటిల్ సాధిస్తుందని భావిస్తున్నా.
''విరాట్ కోహ్లి రోహిత్ శర్మ వరల్డ్ కప్లో కీలకపాత్ర పోషిస్తారు. అనుభవం ఎప్పుడూ ఉపయోగమే. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ గురించి మాట్లాడితే.. కాలమే సమాధానం ఇస్తుంది. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడా లేదా అనేది టైమ్ నిర్ణయిస్తుంది. ఐపీఎల్ ముంబై పటిష్టమైన జట్టు. అయితే భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని రోహిత్-హార్దిక్ తమ వివాదాన్ని ముగించడానికి ఇష్టపడతారని భావిస్తున్నా'' అని హర్భజన్ పేర్కొన్నాడు.