
హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆరు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయాన్ని చేజిక్కుంచుకుంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రోహిత్ నిలదొక్కుకుని సెంచరీని పూర్తి చేశాడు. ధావన్ అవుట్ అవడంతో మరో ఓపెనర్గా బ్యాటింగ్కు దిగిన రోహిత్కు కోహ్లీ జతయ్యాడు. కానీ, కోహ్లీ... రనౌట్ అయి వారి భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు.
దీంతో.. విరాట్ల-రోహిత్ మధ్య సమన్వయ లోపం మరోసారి చర్చనీయాంశమైంది. వన్డేల్లో వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నపుడు ఎవరో ఒకరు రనౌట్ కావడమిది ఏడోసారి కావడం గమనార్హం. ఏడు రనౌట్లలో కోహ్లీవే ఐదు కాగా.. రెండుసార్లు రోహిత్ రనౌటై వెనుదిరిగాడు.
వన్డేల్లో అత్యధికంగా రనౌట్లున్న భారత జోడీ సచిన్-గంగూలీలదే. వాళ్లిద్దరి మధ్య 176 భాగస్వామ్యాలు నమోదవగా.. తొమ్మిదిసార్లు ఎవరో ఒకరు రనౌటయ్యారు. ద్రవిడ్-గంగూలీ ఏడు రనౌట్లతో (87 భాగస్వామ్యాలు) రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి-రోహిత్ వారిని సమం చేశారు.
వీళ్లిద్దరి మధ్య 62 భాగస్వామ్యాల్లోనే ఏడు రనౌట్లుండటం గమనార్హం. గత పదేళ్లలో అత్యధిక రనౌట్లున్న జోడీల్లో వీరిది రెండో స్థానం. ఇప్పటికే సిరీస్ను చేజిక్కుంచుకున్న భారత్ నామమాత్రమైన చివరి వన్డేను దక్షిణాఫ్రికా జట్టుతో 16న ఆడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.