టీమిండియా బ్యాటింగ్కు మూలస్తంభాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ అనంతరం మిగిలిన ఫార్మాట్లకు కూడా వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. అయితే పుష్కర కాలం నుంచి భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీరిద్దరు ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటిస్తే జట్టు బలహీనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
యువ ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటున్నా నిలకడగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. అంతేగాక ప్రధాన టోర్నీల్లో, కీలక మ్యాచ్ల్లో మోస్తారు సీనియర్లు కూడా తడబడుతున్నారు. దీంతో జట్టు భారాన్ని రోహిత్-కోహ్లినే ఇప్పటికే మోస్తున్నారు. కానీ 35 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్ ఎన్ని రోజులు అంతర్జాతీయ క్రికెట్ ఆడతారనే విషయంపై స్పష్టత లేదు.

అయితే రోహిత్, కోహ్లి స్థానాలను భర్తీ చేయడం కష్టమే అని, కానీ వాళ్ల వారసులుగా యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 అనంతరం రాహుల్ ద్రవిడ్తో పాటు సహాయక సిబ్బంది కూడా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
''రోహిత్, కోహ్లి వంటి స్టార్లను భర్తీ చేయడం అంత తేలిక కాదు. కానీ ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్ అనంతరం టీ20ల్లో భవిష్యత్కు కాస్త భరోసా దక్కిందనిపించింది. వన్డేలు, టెస్టు ఫార్మాట్లో ఈ భావన రావడం కోసం కొన్నేళ్ల సమయం పడుతుంది. అయితే సంధి దశ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో బలమైన బ్యాటింగ్ ఉంది. ఎంతో మంది నాణ్యమైన ప్లేయర్లు వస్తున్నారు. అయితే వాళ్లను సరైన పద్ధతిలో తీసుకురావడమే కీలక విషయం''
''శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు సత్తాచాటుతారని ఆశిస్తున్నా. దీంతో పరివర్తన దశ సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా. ఇక వన్డేల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య వంటి ప్లేయర్లు జట్టులోనే ఉన్నారు. ఇక గిల్, జైస్వాల్ సుదీర్ఘ కాలంపాటు మూడు ఫార్మాట్లలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్లో భారత బ్యాటింగ్కు వారిద్దరూ వెన్నెముకగా నిలుస్తారు'' అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నాడు.