ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు అత్యంత చెత్త ఫామ్లో ఉన్నారు. జట్టుకు మంచి ఓపెనింగ్లు ఇవ్వలేక సతమతం అవుతున్నారు. టీం కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో అడపా దడపా ఒక ఇన్నింగ్స్లో తప్పితే అతను ఆడిందేం లేదు. టీ20 వరల్డ్ కప్లో కూడా జట్టుకు సరైన ఆరంభాలు అందించలేకపోయాడు. ఓపెనర్ల వల్లే వరల్డ్ కప్ ఓడామని పలువురు అనేంతలా ఉన్నాయి ఓపెనర్ల విన్యాసాలు.
కివీస్ పర్యటనలో కూడా ఓపెనర్లు పెద్దగా రాణించలేదు. అయితే ఆ టోర్నీలో రోహిత్ శర్మ ఆడలేదు. వరల్డ్ కప్ ముందు కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. అతను చెప్పుకోదగ్గ రీతిలో ఆడింది ఎప్పుడో చెప్పడం కూడా కష్టం. ఈ క్రమంలో రోహిత్ అభిమానులు మాత్రం కొంచెం అదృష్టం కలిసొస్తే రోహిత్ మళ్లీ సత్తా చాటుతాడని అంటున్నారు. అందుకేనేమో రోహిత్ కూడా తన అదృష్టాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించాడు. చేసింది 27 పరుగులే అయినా భవిష్యత్తులో కొద్దో గొప్పో రాణిస్తాడనే ఆశలు కల్పించాయి.
ఈ మ్యాచ్లో రోహిత్ చేసిన పని ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ తన బ్యాటు వాడలేదు. టీ20ల్లో సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ బ్యాటు వాడాడు. రోహిత్ ఆడే సమయంలో అతని బ్యాటు కింది భాగంలో 'ఎస్ కే యాదవ్' అనే అక్షరాలు కనిపించాయి. ఇవి రెండు, మూడుసార్లు కెమెరా కంటికి చిక్కాయి. ఇది చూసిన అభిమానులంతా మళ్లీ ఫామ్ అందుకోవడానికి రోహిత్ నానా తిప్పలూ పడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రోహిత్ ఫామ్ అందుకుంటే చాలని మరికొందరు అంటున్నారు. మరి రెండో వన్డేలో కూడా రోహిత్ ఇదే బ్యాటు వాడతాడో లేదంటే మళ్లీ తన పాత బ్యాటును తెచ్చుకుంటాడో చూడాలి.