సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాభవం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఓవరాల్గా 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ను చేజార్చుకుంది.
అయితే ఈ ఘోర పరాజయానికి ఒక్క రోజు ముందే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అంతేగాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు కూడా టీమిండియా వివరాలను వెల్లడించింది. అయితే న్యూజిలాండ్ చేతిలో రోహిత్ శర్మ ఓటమిని ముందే ఊహించి ఆస్ట్రేలియా సిరీస్కు భారత జట్టు ఎంపికను త్వరగా చేయాలని బీసీసీఐపై ఒత్తిడి చేశాడని తెలుస్తోంది. అందుకే కివీస్తో రెండో టెస్టు ఫలితం రాకముందే రాత్రి 10 గంటలకు టీమిండియా వివరాలను బీసీసీఐ వెల్లడించినట్లు సమాచారం.

సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టుపై విమర్శలు పెద్దఎత్తున వస్తాయని, అవి ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో రాత్రికే రాత్రే సెలక్షన్ కమిటీతో రోహిత్ శర్మ సమావేశమై జట్టును ఖరారు చేశాడని తెలుస్తోంది. ఊహించినట్లుగానే న్యూజిలాండ్ ఓటమి అనంతరం టీమిండియాపై విమర్శలు మొదలయ్యాయి. ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెను తిరిగి జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ పెరిగింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫామ్లో లేకపోవడం, ఒత్తిడిని జయించే అనుభవం యువ ఆటగాళ్లలో లేకపోవడంతో.. జట్టులో పుజారా, రహానె ఉండటం అవసరమని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలంటే పుజారా అనుభవం జట్టుకు అవసరమని అంటున్నారు. ఇటీవల రంజీ ట్రోఫీలో పుజారా డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికే ఆసీస్ సిరీస్కు భారత జట్టును ప్రకటించడంతో ఈ డిమాండ్స్కు ప్రాధాన్యత కరువైంది.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.