ఇంగ్లండ్ సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు తమ టెస్టు ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ తిరిగి తన మొదటి ర్యాంక్ను అందుకున్నాడు. ఫస్ట్ ర్యాంక్ను సాధించడం అశ్విన్కు ఇది ఆరోసారి. 2015 డిసెంబర్లో తొలిసారి అగ్రస్థానాన్ని ఎగబాకాడు.
మరోవైపు బుమ్రా తొలి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో సత్తాచాటిన హేజిల్వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కులు చూపించిన కుల్దీప్ యాదవ్ 15 స్థానాలు దాటి 16వ ర్యాంక్కు చేరుకున్నాడు. తన కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా టాప్ ఆర్డర్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అయిదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్లో నిలిచాడు. యశస్వీ జైస్వాల్ 740 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరాడు. రెండు ర్యాంక్లను మెరుగుపర్చుకున్నాడు. అయితే ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడిన సమయానికి 740 రేటింగ్ పాయింట్లు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. డాన్ బ్రాడమన్ (752), మైక్ హస్సీ (741) మాత్రమే అతడి కంటే ముందున్నారు.
ధర్మశాల టెస్టులో సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్ 11 స్థానాలు ఎగబాకి 20 ర్యాంక్లో నిలిచాడు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు దూరమైన ఓ ర్యాంక్ను కోల్పోయి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ 15వ ర్యాంక్లో ఉన్నాడు. ఆల్రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
కాగా, టెస్టుల్లో 2019లో ఓపెనర్గా అవతారమెత్తిన రోహిత్ శర్మ ఆ తర్వాత పరుగులు వరద పారిస్తున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2022లో టెస్టుల్లో కూడా సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ను టాప్లో నిలిపాడు. తాజాగా టీమిండియా తరఫున బ్యాటింగ్లో అత్యుత్తమ ర్యాంకర్గా నిలిచాడు.