స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమి మోకాలికి వాపు వచ్చిందని, ఈ నేపథ్యంలో అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడం కష్టమని రోహిత్ పేర్కొన్నాడు. అయితే రెండు వారాలకు ముందు తన మోకాలికి గాయమని వచ్చిన వార్తలపై షమి మండిపడ్డాడు. నిరాధారమైన పుకార్లను ఎందుకు ప్రచారం చేస్తున్నారని అన్నాడు.
ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు తాను గానీ, బీసీసీఐ గానీ చెప్పలేదని, అయినప్పటికీ ఎందుకు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని షమి సీరియస్ అయ్యాడు. అయితే తాజాగా షమి మోకాలికి వాపు వచ్చిందని, దాంతో చికిత్స తిరిగి ప్రారంభించాల్సి వస్తుందని రోహిత్ శర్మ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం షమి ఎన్సీఏలో ఉన్నాడని రోహిత్ చెప్పాడు.

''ఆస్ట్రేలియా సిరీస్కు మహ్మద్ షమిని ఎంపిక చేయడం కఠినమైన నిర్ణయం. అతని మోకాలికి వాపు వచ్చింది. ఇది అతన్ని మరోసారి వెనక్కి వెళ్లేలా చేసింది. అతను తిరిగి చికిత్స ప్రారంభించాల్సి వచ్చింది. షమి ఎన్సీఏలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో అతన్ని ఆస్ట్రేలియాకు తీసుకోని వెళ్లాలని అనుకోవట్లేదు. దీని గురించి ఆలోచిస్తున్నాం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా, 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచకప్ ఆడిన షమి తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఏలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించానని షమి ఇటీవల కూడా పేర్కొన్నాడు. ప్రత్యర్థితో, ఫార్మాట్తో సంబంధం లేకుండా రంజీ ట్రోఫీలో అయినా తిరిగి పోటీ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.
అయితే షమి మోకాలి వాపు వచ్చిందని, దాంతో కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆటకు దూరం కానున్నాడని, ఆస్ట్రేలియా పర్యటనకు కూడా షమి అందుబాటులో ఉండనని ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మహ్మద్ షమి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ వార్తలు అవాస్తవమని, ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని కోరాడు. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.