ఎలాంటి క్రీడలు ఆడే వారికైనా సరే డోపింగ్ టెస్టులు జరుగుతూనే ఉంటాయి. మన క్రికెటర్లు కూడా దీనికి అతీతులు కాదు. ఈ టెస్టులు నిర్వహించడానికి భారతదేశంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఉంది. ఈ సంస్థ 2021, 2022 సంవత్సరాల్లో మొత్తం 5961 డోపింగ్ టెస్టులు నిర్వహించిందట. కానీ వీటిలో కేవలం 114 సార్లే క్రికెటర్లకు ఈ టెస్టులు చేసింది. తాజాగా ఈ లెక్కలు బయటకు వచ్చాయి.
అథ్లెట్లు తమ కెరీర్లో చాలాసార్లు ఈ టెస్టులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెటర్లు మాత్రం ఈ రెండేళ్లలో కేవలం రెండుసార్లే ఈ టెస్టుల్లో పాల్గొనడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ క్రికెటర్లకు ఎన్సీయేలో రకరకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం వల్లనే నాడా వీరిపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదేమో? అని కొందరు అంటున్నారు.

ఇక క్రికెటర్లకు చేసిన 114 టెస్టుల్లో కూడా ఎక్కువ సార్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకే ఈ టెస్టులు చేశారట. ఈ రెండేళ్లలో రోహిత్ను నాడా అధికారులు ఆరుసార్లు కలిసి టెస్టులు చేశారని సమాచారం. అదే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మాత్రం ఒక్కసారి కూడా ఈ టెస్టులు చేయలేదు. అతనితోపాటు హార్దిక్ పాండ్యా వంటి కొంత మందికి అసలు డోపింగ్ టెస్టులే చేయలేదని తెలుస్తోంది.
బీసీసీఐ కాంట్రాక్టులు ఉన్న 12 మంది ఆటగాళ్లక నాడా అసలు డోపింగ్ టెస్టులే చేయలేదు. వారిలో కోహ్లీ, హార్దిక్ కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్కయిన మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. భారత క్రికెటర్లు ఇంజెక్షన్లు చేయించుకొని ఫిట్నెస్ టెస్టులకు హాజరవుతారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇకపై భారత క్రికెటర్లకు కూడా డోపింగ్ టెస్టులు ఎక్కువగా చేస్తారేమో చూడాలి.