
హైదరాబాద్: దాదాపు రెండు నెలల పాటు సాగిన క్రీడా సంరంభం ఐపీఎల్ అనంతరం దాదాపు ఆటగాళ్లందరూ విదేశాలకు చెక్కేశారు. ఈ క్రమంలోనే భార్యతో కలిసి రోహిత్ శర్మ అమెరికా చేరుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ అరుదైన అవకాశాన్ని కొట్టేశాడు. అమెరికాలో సుప్రసిద్ధ 'మేజర్ లీగ్ బేస్బాల్'లో భారత క్రికెటర్ రోహిత్ శర్మకు పాల్గొనే అవకాశం దక్కింది. ఆ లీగ్లో ఆడే సియాటెల్ మారినర్స్ జట్టు తరఫున అతను 'ఫస్ట్ పిచ్' చాన్స్ కొట్టేశాడు. ఈ మేరకు భారత స్టార్ క్రికెటర్ను సియాటెల్ జట్టు ఆహ్వానించింది.
సాఫెకొ ఫీల్డ్లోని మారినర్స్ హోమ్ గ్రౌండ్లో ప్రారంభోత్సవ మ్యాచ్ సందర్భంగా రోహిత్ 'ఫస్ట్ పిచ్'తో బేస్బాల్ మ్యాచ్ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. మ్యాచ్ ముందు బేస్బాల్ను విసరడమే 'ఫస్ట్ పిచ్' అంటారు.
'దేశ్ లెజెండ్స్ ఆఫ్ క్రికెట్ సిరీస్'లో భాగంగా ఐఎమ్జీ రిలయన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ తరపున మూడు రోజుల పర్యటనలో ఉన్న రోహిత్ శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, లాస్ ఏంజిల్స్ పర్యటించనున్నాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ క్లబ్లకు వెళ్లి అక్కడే ఉన్న అభిమానులను, ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలపనున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ పిచ్ అవకాశం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మెరైనర్స్ జట్టు తరపున బేస్బాల్లో నా భార్య పక్కనుండగా ఆడటం ఆనందంగా ఉంది.' అని పేర్కొన్నాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మకు చోటు దక్కించుకోలేకపోయాడు. దానిపై స్పందించిన రోహిత్.. 'ఏది జరగాలో అదే జరుగుతుంది. నేనేమీ తుది జట్టులో మార్పులు కోరుకోవడం లేదు.' అనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.