వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 41 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో లెగ్ స్లిప్లో ఒలీ పోప్ చేతికి చిక్కాడు. గత ఏడు టెస్టు ఇన్నింగ్స్ల్లో రోహిత్ ప్రదర్శన పేలవంగా ఉంది.సౌతాఫ్రికా పర్యటనలో 5,0, 39, 16* పరుగులే సాధించాడు. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 24, 39 పరుగులు చేశాడు.
అయితే రోహిత్ తొలి సెషన్లోపే ఔటవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లి, గాయాలతో రాహుల్, జడేజా రెండో టెస్టుకు అందుబాటులో లేరు. మరోవైపు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్లో లేరు. ఈ నేపథ్యంలో కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా రోహిత్పై బరువైన బాధ్యతలు పెరిగాయి. దీంతో తనకు అచ్చొచ్చిన వైజాగ్ మైదానంలో హిట్మ్యాన్ చెలరేగుతాడని అంచనాలు నెలకొన్నాయి.

కానీ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తూ వికెట్ను సమర్పించుకున్నాడు. నడిపించాల్సిన నాయకుడే చెత్త ప్రదర్శన చేయడమేంటని రోహిత్ను విమర్శిస్తూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా, టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (4), యశస్వీ జైశ్వాల్ (51) క్రీజులో ఉన్నారు. జైశ్వాల్ సాధికారికంగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. శుభ్మన్ గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్లో ఫోక్స్ చేతికి చిక్కాడు.
కాగా, వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు అంత కష్టతరంగా లేదు. బ్యాటర్లు స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించాలంటే భారత యువ బ్యాటర్లు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఇవాళ మ్యాచ్తో రజత్ పటిదార్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. అయిదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు.