అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్లు సత్తాచాటలేకపోయారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
రెండో ఇన్నింగ్స్లో బుమ్రాకు తోడుగా సిరాజ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్కు అంతగా అనుకూలించని పిచ్పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. ఇక యువ పేసర్ హర్షిత్ రాణా నిరాశపరిచాడు. అయితే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బుమ్రా మినహా ఇతర బౌలర్ల ప్రదర్శన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిసారి బుమ్రాపై భారం వేయలేమని, ఇతర బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నాడు. ఇది ప్రతి ఒక్క బౌలర్కు వర్తిస్తుందని రోహిత్ చెప్పాడు.

ఒక్క బౌలర్తోనే మ్యాచ్ ఆడట్లేదని, రెండు ఎండ్ల నుంచి బుమ్రాతోనే బౌలింగ్ వేయించలేమని రోహిత్ అన్నాడు. జట్టును గెలిపించే బాధ్యత సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి...ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నాడు. సిరీస్లోని అయిదు టెస్టుల ఆడటం కోసం బుమ్రాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రోహిత్ చెప్పాడు. స్పెల్ ముగిసిన అనంతరం ప్రతిసారి బుమ్రా వద్దకు వెళ్లి, పనిభారం గురించి తెలుసుకుంటున్నామని వెల్లడించాడు.
బుమ్రా తాజాగా ఉంటే అయిదు టెస్టులు ఆడగలడని, అందుకే అతని పనిభారం, బౌలింగ్ను విశ్లేషిస్తున్నామని రోహిత్ తెలిపాడు. రోజంతా బుమ్రాతోనే బౌలింగ్ చేయించలేమని, ఇతర బౌలర్లు కూడా ముఖ్యమే అని అన్నాడు. ప్రతి బౌలర్కు ఎంత ఓపిక ఉందని, ఎన్ని ఓవర్లు వేయగలిగే సామర్థ్యం ఉందని పరిశీలిస్తున్నామని అన్నాడు. కొందరు టెస్టుల్లో ఇటీవలే అరంగేట్రం చేశారని, వాళ్లకు మద్దతు ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నాడు. ఇదంతా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామని హిట్ మ్యాన్ చెప్పాడు. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.