ఇప్పటికీ అత్యధిక పరుగల మొనగాడు రోహిత్ శర్మే!

లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత క్రికెట్ జట్టు ప్రస్థానం సెమీఫైనల్ వద్దే ఆగిపోయింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. ముగింపు మాత్రం విషాదకరం. అనూహ్యంగా బ్లాక్ క్యాప్స్ చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్ వాకిట్లో చతికిల పడింది. లోయర్ ఆర్డర్లో మహేంద్రసింగ్ ధోనీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకోకపోయి ఉంటే- ఇంకా దారుణ ఓటమిని చవి చూసి ఉండేది భారత జట్టు. అత్యంత అవమానకరంగా నిష్క్రమించాల్సిన దుస్థితిని ఎదుర్కొని ఉండేది.

టాప్లో రోహిత్ శర్మ..
ఇదలావుంచితే- భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకించి- రోహిత్ శర్మను పిచ్చిగా ప్రేమించే వారికి ఓ చిన్న ఊరట లభించింది. ఇప్పటికీ- ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతూనే ఉన్నాడు రోహిత్ శర్మ. 648 పరుగులతో అగ్రస్థానంలో నిల్చున్నాడీ డాషింగ్ ఓపెనర్. రోహిత్ శర్మ తాను ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 648 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు 81.0. సెమీ ఫైనల్లో ఒక్క పరుగుకే అవుటైనప్పటికీ.. అతని రికార్డు మాత్రం చెక్కు చెదరలేదు.

ఒక్క పరుగుతో రెండో స్థానంలో వార్నర్..
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేతిలో రోహిత్ శర్మ రికార్డు తుడిచి పెట్టుకుని పోతుందనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమైంది. ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు ప్రయాణం సెమీ ఫైనల్ వద్దే ఆగిపోవడం, డేవిడ్ వార్నర్కు ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం ఉండటంతో రోహిత్ శర్మ రికార్డు కనుమరుగవుతుందని అనుకున్నారు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో గురువారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.

మూడో స్థానంలో షకీబుల్..
దీనితో- ఈ టోర్నమెంట్లో వార్నర్ చేసిన మొత్తం పరుగుల సంఖ్య 647. అంటే- రోహిత్ శర్మ చేసిన అత్యధిక పరుగులకు ఒక రన్ తేడా ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు ఆడటానికి మరో మ్యాచ్ కూడా లేదు. ఫలితంగా- టాప్ స్కోరర్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. కాగా- బంగ్లాదేశ్ ఓపెనర్ షకీబుల్ హసన్ 606 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ రికార్డుకు ప్రమాదం అనేది ముగిసి పోలేదు. ఇంగ్లండ్ ఓపెనర్ జో రూట్, న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ల రూపంలో పొంచేవుంది.

పొంచివున్న ప్రమాదం..
ఈ టోర్నమెంట్లో ఇప్పటిదాకా జో రూట్ 549, కేన్ విలియమ్సన్ 548 పరుగులు చేశారు. వారిద్దరూ ప్రపంచకప్ ఫైనల్ ఇంకా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- వారిద్దరిలో ఏ ఒక్కరు సెంచరీ బాది పడేసినా- రోహిత్ శర్మ రికార్డు కనుమరుగవుతుంది. ఫైనల్ మ్యాచ్లో గెలవాలంటే- న్యూజిలాండ్ లేదా ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించి తీరాల్సిన అవసరం ఉంది. జో రూట్ ఇప్పటికే మాంచి ఊపు మీద ఉన్నాడు. అదే జోరును ఫైనల్ మ్యాచ్లో కొనసాగిస్తే.. సెంచరీని సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదతనికి. కేన్ విలియమ్సన్ పరిస్థితీ దాదాపు ఇంతే. జట్టును బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వస్తున్నాడు కేన్ విలియమ్సన్. వరుసగా అర్ధసెంచరీలను సాధిస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే విధంగా బ్యాటింగ్ చేసి, తన అర్ధసెంచరీని సెంచరీగా మార్చుకోగలిగితే- అత్యధిక స్కోరును సాధించిన బ్యాట్స్మెన్గా నిలుస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications