Viral Video: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ, కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ మధ్య స్టేడియంలో జరిగిన సుదీర్ఘ సంభాషణ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పెర్త్ వన్డే ప్రారంభానికి ముందు పిచ్పై ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం.. అందులో రోహిత్ అన్నయ్యలా సలహాలు ఇస్తుంటే.. శుభ్మన్ గిల్ వాటిని శ్రద్ధగా చేతులు కట్టుకుని వినడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
కెప్టెన్సీ మార్పు వివాదంపై తెర
ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టు ఎంపిక తర్వాత రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నిర్ణయం రోహిత్ శర్మను అవమానించడమేనని కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శించారు. అంతే కాకుండా దీని కారణంగా రోహిత్, గిల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే పెర్త్ వేదికగా జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి పోరుకు ముందు వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అటువంటి పుకార్లన్నింటికీ తెరదించింది.

పెర్త్ పిచ్పై సుదీర్ఘ సంభాషణ
ఆదివారం (అక్టోబర్ 19) జరగబోయే తొలి వన్డే కోసం రోహిత్ శర్మ ముందుగా పెర్త్ పిచ్ను పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ భారత జట్టు పర్ఫార్మెన్స్ అనలిస్ట్ హరి ప్రసాద్ మోహన్తో కలిసి పిచ్ స్వభావం గురించి మాట్లాడుకుంటుండగా.. కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అక్కడికి వచ్చారు. రోహిత్ శర్మ హరి ప్రసాద్తో హరిప్రసాద్ తో సంభాషణను కొనసాగిస్తూనే.. శుభ్మన్ గిల్కు కూడా పిచ్ పరిస్థితులు, ఆస్ట్రేలియా వాతావరణంలో ఎలా ఆడాలనే దానిపై కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించారు.
ఈ సంభాషణలో ఇద్దరి మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయో తెలియకపోయినా.. రోహిత్ శర్మ ఎంతో ప్రేమగా, ఓ సీనియర్ ఆటగాడిలా, మార్గదర్శకుడిలా సలహాలు ఇవ్వడం.. గిల్ వాటిని ఏకాగ్రతతో చేతులు కట్టుకుని శ్రద్ధగా వినడం చూస్తుంటే వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బలమైన బంధం ఉందని స్పష్టమైంది.
ముందు నుంచీ సఖ్యతే..
ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు కూడా వీరిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కనపించింది. బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియోలో రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో రోహిత్... "అరే హీరో, క్యా హాల్ హై భాయ్?" (అరే హీరో, ఎలా ఉన్నావ్?) అని అడగడం వినిపించింది. ఇది కూడా అభిమానుల హృదయాలను తాకింది.
రోహిత్ శర్మ కెరీర్ దృక్పథం
రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత ఆయన ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. అంతేకాకుండా, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో, రోహిత్ శర్మ ఇకపై వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమ్ ఇండియా తరపున ఆటగాడిగా కొనసాగనున్నారు. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల మద్దతు లభించడం జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.