
హైదరాబాద్: మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ కొన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులు చేసి వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డును సృష్టించాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ ఇదొక్కటే గాక, మరికొన్ని రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 40 సిక్సులతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును 41 సిక్సులతో రోహిత్ బద్దలుకొట్టాడు.
ఇక ఈ రోజు చేసిన సెంచరీ కూడా ఓ సంచలనమే. వన్డే మ్యాచ్లలో ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కూడా చేరిపోయాడు. ఈ లిస్ట్లో సచిన్ తొమ్మిది సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్ 6 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ కూడా అదే స్థానంలో ఉన్నాడు. అంతేకాక.. వన్డే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ తన రెండో వన్డేలోనే శతకాన్ని నమోదు చేసి మరో రికార్డును సాధించాడు.
అయితే సచిన్ కెప్టెన్గా బాధ్యత స్వీకరించిన తొలి వన్డేలోనే సెంచరీ నమోదు చేయగా.. కోహ్లీ, రోహిత్, గంభీర్లు రెండో వన్డేలో సెంచరీ నమోదు చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో పాటు వన్డేల్లో భారత జట్టు కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో సెహ్వాగ్ 219 పరుగులతో మొదటిస్థానంలో ఉన్నాడు.
రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 393 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ విజృంభించి (208 నాటౌట్) గా, శ్రేయాస్ అయ్యర్ (88), ధావన్ (68) పరుగులు చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.