
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. టీమిండియా టెస్టులు ఆడడానికి ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ ఇప్పుడే ఎవరిని టెస్టు కెప్టెన్గా నియమించే ఆలోచనలో లేదు. దీంతో అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు టీమిండియాకు టెస్టు కెప్టెన్ ఎవరైతే బాగుంటుందనే విషయంలో తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు.
టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో హిట్మ్యాన్ రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉండాలని గంభీర్ ఆశించారు. ఇప్పటికే వన్డేలు, టీ20లకు కెప్టెన్గా ఉన్న రోహిత్శర్మనే టెస్టులకు కూడా నియమించాలని ఆయన సూచించారు. వేర్వేరు ఫార్మాట్లట్లో వేర్వేరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదన్నారు. పైగా ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ వంటి మెగా టోర్నీ ఉందని గంభీర్ గుర్తు చేశారు. అందుకే ఇప్పటికే పరిమిత ఓవర్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మనే టెస్టులకు కూడా కెప్టెన్ చేయాలని చెప్పారు. అదే విధంగా కేఎల్ రాహుల్ అన్ని ఫార్మాట్లలో వైస్ కెప్టెన్గా ఉండాలని గౌతీ అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండడం వల్ల జట్టులో స్థిరత్వం ఉంటుందని గంభీర్ తెలిపారు. అంతేకాకుండా రోహిత్ శర్మకు అన్ని ఫార్మాట్లలో జట్టును నడపగల సత్తా ఉందని చెప్పారు. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీ నైపుణ్యంపై గంభీర్ ప్రశంసలు కురిపించారు.
టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై కూడా గౌతం గంభీర్ స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగతమని అన్నారు. అలాగే టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ మంచి వాతావరణంలో తప్పుకున్నాడని చెప్పిన గంభీర్.. వైట్ బాల్ క్రికెట్ విషయంలో మాత్రం అలా చెప్పలేమన్నారు. కాగా 2014 నుంచి భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ మొత్తం 68 టెస్టు మ్యాచ్ల్లో జట్టును నడిపించాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 40 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కేవలం 17 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో భారత్కు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా కూడా కోహ్లీ నిలిచాడు. అలాగే విదేశాల్లో భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.