రోహిత్, ధావన్ల ప్రమాదకరమైన ఓపెనింగ్:
అన్ని విభాగాల్లోనూ అదుర్స్ అనే రీతిలో కనిపిస్తున్న భారత జట్టులో ఎలాంటి మార్పులకూ అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధవన్ శుభారంభాలు అందిస్తుండగా వన్ డౌన్లో అంబటి రాయుడు తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. బంగ్లాదేశ్పై నాలుగో నెంబర్లో వచ్చిన ఎంఎస్ ధోనీ స్థాయికి తగ్గట్టుగా ఆడడం జట్టుకు శుభపరిణామం.
ఏడో నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా :
దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్లతో పాటు చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా కారణంగా ఏడో నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రా ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బతీయగలుగుతున్నారు. కుల్దీప్, చాహల్లు మాత్రం ఆశించినమేర ఆకట్టుకోలేకపోతున్నారు. జడేజా మాత్రం తన కమ్బ్యాక్ మ్యాచ్లో నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచి అంచనాలు పెంచాడు.
బ్యాటింగ్కు వెన్నెముకలా షోయబ్ మాలిక్
ప్రత్యర్థులను వణికించేందుకు నలుగురు లెఫ్టార్మ్ పేసర్లు.. ఎలాంటి పిచ్పైనైనా ఆడగల బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ పాకిస్థాన్ ఎందుకో తడబడుతోంది. ఇక్కడి వాతావరణం, మైదానం తమకు అలవాటే అయినా ఇతర జట్లపై ఆధిక్యం చూపలేకపోతోంది. అందుకే ఈసారి కీలక పోరులో మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో హరీస్ సొహైల్, షాదాబ్ ఖాన్ స్థానంలో మొహమ్మద్ నవాజ్ వచ్చే అవకాశాలున్నాయి. జట్టు బ్యాటింగ్కు షోయబ్ మాలిక్ వెన్నెముకలా ఉంటున్నాడు.
ఆందోళనకు గురిచేస్తున్న అమీర్ పేలవ ఫామ్
ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తున్నా ఫఖర్ జమాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడం ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అతడు భారత్పై సెంచరీ చేసి హీరోగా మారాడు. అతడు ఫామ్ అందిపుచ్చుకుంటే భారత్కు ఇబ్బందే. ఇక వికెట్లు తీయలేకపోతున్న వారి ప్రధాన బౌలర్ మొహమ్మద్ అమీర్ పేలవ ఫామ్ పాక్ను దెబ్బతీస్తోంది. అందుకే అతడు అఫ్ఘాన్తో మ్యాచ్లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. భారత్పై గెలవాలంటే పేసర్లు హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్ రాణించాల్సి ఉంటుంది.