
పూణే: టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు. ఇక భారత్ నుంచి మాజీ దిగ్గజాలు సచిన్ టెండ్యూలర్-సౌరవ్ గంగూలీ తర్వాత అత్యుత్తమ ఓపెనింగ్ జోడి వీరిద్దరిదే. పూణే వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్-ధావన్లు వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ల జోడి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ధావన్ (67; 56 బంతుల్లో 10×4) అర్ధ శతకం సాధించాడు. మైదానంలో ఉన్నంతసేపు చక్కని బౌండరీలతో చెలరేగాడు. రోహిత్ (37; 37 బంతుల్లో 6×4) సైతం తనదైన శైలీలో అలరించాడు. దీంతో వీరి భాగస్వామ్యం మొత్తంగా 5000 పరుగులు దాటేసింది. వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులను సాధించిన ఓపెనింగ్ జోడీ సచిన్, గంగూలీదే. వీరిద్దరూ తొలి వికెట్కు 8227 పరుగులు చేశారు.
సచిన్ టెండ్యూలర్-సౌరవ్ గంగూలీ తర్వాత మరెవ్వరూ వీరిని సమీపించలేదు. కుమార సంగక్కర-మహేళ జయవర్దనె (5992), తిలకరత్నే దిల్షాన్-కుమార సంగక్కర (5475), సనత్ జయసూర్య-మార్వన్ ఆటపట్టు (5462), గిల్ క్రిస్ట్-మాథ్యూ హెడేన్ (5409), గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హెయిన్స్ (5206) పరుగులతో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ జోడీ చేరింది. ఈ జాబితాలో లంక జోడీలు ఎక్కువగా ఉన్నాయి. కుమార సంగక్కర రెండు జోడీల్లో పాలుపంచుకోవడం విశేషం.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు, టీ20 సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే ట్రోఫీనీ ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్ (67), పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ (64; 44 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్ కరన్ (95 నాటౌట్; 83 బంతుల్లో 9×4, 3×6) భారత్ను భయపెట్టాడు. మలన్ (50; 50 బంతుల్లో 6×4) ఆకట్టుకున్నాడు. శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు.