
సమైరా అనుమతి ఇచ్చింది:
విశ్రాంతి సమయంలో రోహిత్ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. రోహిత్ సతీమణి రితిక మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రితిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో రోహిత్, సమైరా ఇద్దరూ ఫోన్లో నిమగ్నమయ్యారు. రోహిత్ చిన్నారి సమైరాకు ఏదో చూపిస్తున్నాడు. సమైరా ఎంతో ఆసక్తిగా రోహిత్ చూపించిన అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ వీడియోకి రితిక 'రోహిత్ పోస్ట్కు సమైరా అనుమతి ఇచ్చింది' అని రాసుకొచ్చారు.

రోహిత్ కొత్త సోషల్ మీడియా మేనేజర్:
రితిక పోస్ట్ చేసిన వీడియోపై ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ సరదాగా ఓ ట్వీట్ చేసింది. 'రోహిత్ కొత్త సోషల్ మీడియా మేనేజర్ ఎంత క్యూట్గా ఉంది. ఆమెకు పదికి ఎన్ని పాయింట్లు ఇస్తారు' అని ట్వీట్ చేసింది. ముంబై ట్వీట్పై నెటిజన్లు తమదైన స్టయిల్లో రిప్లై ఇస్తున్నారు. 'పదికి పది పాయింట్లు' అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైకి నాలుగు ట్రోఫీలు అందించాడు.

దక్షిణాఫ్రికా సిరీస్లో పునరాగమనం?:
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో ఆడే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా కివీస్తో జరిగిన వన్డే సిరీస్లో హిట్మ్యాన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్కు సానుకూలాంశంగా మారింది. హిట్మ్యాన్ జట్టులో ఉంటే వన్డే సిరీస్ను భారత్ 0-3తో కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

కోహ్లీకి అసలైన సవాల్:
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్లు ముగిసాయి. 5-0తో భారత్ టీ20 సిరీస్ గెలవగా.. 3-0తో కివీస్ వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది. ఈ నెల 21 నుండి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. వన్డే, టీ20 సిరీస్లో పరుగులు చేయలేకపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు సిరీస్ రూపంలో అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. ఐదు టీ20లలో 105 పరుగులు, మూడు వన్డేలలో 75 పరుగులే చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గాడిలో పడుతాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications












